Tunnel Collapse: మాన్యువల్‌ డ్రిల్లింగ్‌కు అధికారులు రెడీ.. సహాయక చర్యలకు ఆటంకాలు.. ఆందోళనలో కార్మికుల కుటుంబాలు

ఉత్తరకాశీ సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులను కాపాడేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. సొరంగంలో చిక్కుకున్నవారిని సురక్షితంగా బయటకి తీసుకొచ్చేందుకు మాన్యువల్‌ డ్రిల్లింగ్ రెడీ అయ్యారు అధికారులు. ఉన్నతాధికారులతో చర్చల తర్వాత డ్రిల్లింగ్‌ చేపట్టనున్నారు. మరోవైపు సహాయక కార్యక్రమాల్లో పదే పదే ఆటంకాలు ఏర్పడుతూ ఉండడంతో బాధిత కార్మికుల కుటుంబాల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. 

Tunnel Collapse: మాన్యువల్‌ డ్రిల్లింగ్‌కు అధికారులు రెడీ.. సహాయక చర్యలకు ఆటంకాలు.. ఆందోళనలో కార్మికుల కుటుంబాలు
Uttarkashi Tunnel Collapse

Updated on: Nov 26, 2023 | 7:27 AM

ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ టన్నెల్‌లో చిక్కుకుపోయిన కార్మికులను కాపాడేందుకు మాన్యువల్‌ డ్రిల్లింగ్ రెడీ అయ్యారు అధికారులు. శిథిలాల ద్వారా ఆగర్‌ మెషీన్‌తో చేస్తున్న డ్రిల్లింగ్‌కు మళ్లీ మళ్లీ అవాంతరాలు ఎదురువుతుండటంతో మాన్యువల్‌ డ్రిల్లింగ్‌ చేయాలని భావిస్తున్నారు. 14 రోజులుగా సిల్‌క్యారా సొరంగంలో కూలీలు చిక్కుకుని పోయి ఉన్నారు. వారిని బయటకు తీసేందుకు ఆగర్‌ మెషీన్‌తో డ్రిల్లింగ్ చేస్తుండగా శుక్రవారం రాత్రి ఇనుపపట్టీ అడ్డుపడి నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో ఆగర్‌ మెషీన్‌ను పక్కనపెట్టి మనుషులతో.. డ్రిల్లింగ్ చేయాలని నిర్ణయించారు. అయితే మాన్యువల్ డ్రిల్లింగ్‌కు సమయం ఎక్కువపడుతుంది. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులతో చర్చలు జరుపుతున్నారు. ఆగర్ మిషన్‌ను బయటకు తీసిన తర్వాతే మాన్యువల్ డ్రిల్లింగ్‌ చేపట్టే అవకాశం ఉంది. మరోవైపు సహాయక చర్యలకు పదేపదే ఆటంకాలు కలగడం కార్మికుల కుటుంబాల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

టన్నెల్‌ లోపలికి వెళ్లి పరిస్థితిని స్వయంగా పరిశీలించారు సీఎం పుష్కర్‌సింగ్‌ ధామి. సిల్‌క్యారా సొరంగంలో ఇరుక్కుపోయిన ఆగర్‌ మెషిన్‌ బ్లేడ్లను కట్‌ చేసేందుకు ప్లాస్మా కట్టర్‌ను వినియోగించాలి. ఈ యంత్రాన్ని హైదరాబాద్‌ నుంచి విమాన మార్గంలో తీసుకొచ్చారు. మొత్తం మీద ఇప్పటివరకూ 48.6 మీటర్ల మేర డ్రిల్లింగ్‌ జరగ్గా, 46.8 మీటర్ల వరకూ కార్మికులను బయటకు తీసుకొచ్చేందుకు ఉద్దేశించిన 800 ఎంఎం వ్యాసం గల స్టీలు పైపుల ఏర్పాటు పూర్తయింది. కార్మికులను చేరుకునేందుకు మరో 12 మీటర్ల పైపును అమర్చాల్సి ఉంది. అయితే మాన్యువల్‌ డ్రిల్లింగ్‌తో ఈ రెస్క్యూ కాస్త ఆలస్యంగా కానున్నట్లు తెలుస్తోంది.

టన్నెల్‌లో చిక్కుకున్న కార్మికులు క్షేమంగానే ఉన్నారని అధికారులు చెబుతున్నారు. పైప్‌తో కార్మికులకు ఆహారంతో పాటు ఆక్సిజన్‌ను పంపిస్తున్నారు. ఎప్పటివరకు కార్మికులను టన్నెల్‌ నుంచి బయటకు తీసుకువస్తారన్న విషయంపై మాత్రం క్లారిటీ రావడం లేదు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us