భారత్ – అమెరికా బంధానికి కొత్త బలం.. రక్షణ, అణుశక్తి, ఏఐ రంగాల్లో సంయుక్త కార్యాచరణ!

భారత్–అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలోపేతం కానుందని అమెరికా విదేశాంగ శాఖ డిప్యూటీ సెక్రటరీ ఎస్. పాల్ కపూర్ స్పష్టం చేశారు. రక్షణ, అణుశక్తి, సురక్షిత కృత్రిమ మేధ (AI), ఆధునిక సాంకేతికతల రంగాల్లో ఇరు దేశాలు మరింత సన్నిహితంగా కలిసి పనిచేస్తున్నాయని తెలిపారు.

భారత్ - అమెరికా బంధానికి కొత్త బలం.. రక్షణ, అణుశక్తి, ఏఐ రంగాల్లో సంయుక్త కార్యాచరణ!
Us India Boost Defense

Updated on: Jul 28, 2026 | 8:29 AM

భారత్–అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలోపేతం కానుందని అమెరికా విదేశాంగ శాఖ డిప్యూటీ సెక్రటరీ ఎస్. పాల్ కపూర్ స్పష్టం చేశారు. రక్షణ, అణుశక్తి, సురక్షిత కృత్రిమ మేధ (AI), ఆధునిక సాంకేతికతల రంగాల్లో ఇరు దేశాలు మరింత సన్నిహితంగా కలిసి పనిచేస్తున్నాయని తెలిపారు. హూవర్ ఇన్‌స్టిట్యూషన్‌లో భారత్‌పై నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమానికి అమెరికా మాజీ విదేశాంగ కార్యదర్శి కాండోలీజా రైస్, భారతదేశంలో అమెరికా మాజీ రాయబారి డేవిడ్ సి. ముల్ఫోర్డ్ కూడా హాజరయ్యారు.

సమావేశం అనంతరం పాల్ కపూర్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హయాంలో భారత్–అమెరికా సంబంధాలు మరింత బలపడుతున్నాయని పేర్కొన్నారు. ఈ భాగస్వామ్యం వల్ల రెండు దేశాల్లో ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు, వస్తువుల సప్లై చైన్ మరింత బలోపేతం అవుతోందని తెలిపారు. ఇది భారత్, అమెరికాతో పాటు ఇండో-పసిఫిక్ ప్రాంత స్థిరత్వానికి కూడా ఉపయోగపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

రక్షణ, అణుశక్తి, విశ్వసనీయ ఏఐ వంటి కీలక రంగాల్లో సంయుక్త పరిశోధనలు, సాంకేతిక పరిజ్ఞాన మార్పిడి, పెట్టుబడులు పెంచడంపై ఇరు దేశాలు దృష్టి సారించాయని అమెరికా అధికారులు వెల్లడించారు. గత ఏడాది కుదిరిన కీలక రక్షణ ఒప్పందం ప్రకారం భూమి, సముద్రం, గగనతలం, అంతరిక్షం, సైబర్‌స్పేస్ రంగాల్లో ఇరు దేశాల మధ్య సహకారం మరింత విస్తరించనుంది.

2002 నుంచి భారతదేశం అమెరికా నుంచి అపాచీ, చినూక్ హెలికాప్టర్లు, సి-17, సి-130జే రవాణా విమానాలు, పి-8ఐ సముద్ర గస్తీ విమానాలు, ఎం777 హోవిట్జర్లు వంటి అత్యాధునిక రక్షణ సామగ్రిని కొనుగోలు చేసింది. ఇటీవల భారత ప్రభుత్వం కొన్ని విధానపరమైన సడలింపులు చేయడంతో, భారత ప్రైవేట్ రక్షణ సంస్థలతో భాగస్వామ్య అవకాశాలను పరిశీలించేందుకు అమెరికా అధికారుల బృందం భారత్‌ను సందర్శించింది. దీంతో రక్షణ తయారీ, సాంకేతిక అభివృద్ధి, పెట్టుబడుల రంగాల్లో ఇరు దేశాల సహకారం మరింత వేగం పుంజుకునే అవకాశం కనిపిస్తోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us