Humanity: హ్యాట్సాఫ్‌.. సైకిలిస్టులకు ఉచితంగా ఫ్లాష్ లైట్లు అందిస్తోన్న యువతి.. అసలు విషయం తెలిస్తే కన్నీళ్లు ఆగవు

|

Mar 26, 2023 | 1:06 PM

పై ఫొటోలో ప్లకార్డు పట్టుకుని కనిపిస్తున్న యువతి పేరు ఖుషీ పాండే. వయసు 22 సంవత్సరాలు. ఉత్తర ప్రదేశ్‌ రాజధాని లక్నోలోని ఓ కాలేజీలో ఎల్‌ఎల్‌బీ చదువుతోంది. బాగా చదువుకుని నల్లకోటు ధరించాలనుకుంటోన్న ఈ యువతికి తాత అంటే ప్రాణం. కానీ ఆయన ఇప్పుడు ప్రాణాలతో లేడు. 2020లో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ఆయన కన్నుమూశారు.

Humanity: హ్యాట్సాఫ్‌.. సైకిలిస్టులకు ఉచితంగా ఫ్లాష్ లైట్లు అందిస్తోన్న యువతి.. అసలు విషయం తెలిస్తే కన్నీళ్లు ఆగవు
Khushi Pandey
Follow us on

పై ఫొటోలో ప్లకార్డు పట్టుకుని కనిపిస్తున్న యువతి పేరు ఖుషీ పాండే. వయసు 22 సంవత్సరాలు. ఉత్తర ప్రదేశ్‌ రాజధాని లక్నోలోని ఓ కాలేజీలో ఎల్‌ఎల్‌బీ చదువుతోంది. బాగా చదువుకుని నల్లకోటు ధరించాలనుకుంటోన్న ఈ యువతికి తాత అంటే ప్రాణం. కానీ ఆయన ఇప్పుడు ప్రాణాలతో లేడు. 2020లో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ఆయన కన్నుమూశారు. సైకిల్‌పై వెళుతున్నఆయనను ఓ కారు బలంగా ఢీకొట్టింది. దీంతో ఆయన అక్కడికక్కడే చనిపోయారు. సైకిల్‌కు లైట్లు లేకపోవడం, చీకటి కారణంగా కారు డ్రైవర్‌ తన తాతను గమనించకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగింది. తాత మరణం నుంచి కోలుకోవడానికి ఖుషికి చాలా సమయమే పట్టింది. అదే సమయంలో తన తాతలా మరొకరు ప్రాణాలు కోల్పోకూడదని భావించింది. అందుకే వీలైనప్పుడల్లా వీధులు, ఫుట్‌పాత్‌ల ఇలా ప్లకార్డు పట్టుకుని తిరుగుతోంది. ‘దయచేసి సైకిళ్లకు లైట్లు అమర్చుకోండి’ అని ఆ ప్లకార్డులో రాసి ఉంది. ఇంతటితో ఆగని ఖుషి తనవంతుగా ఉచితంగా సైకిళ్లకు లైట్లు బిగిస్తోంది. అలా ఇప్పటివరకు సుమారు 1500కు పైగా రెడ్‌ లైట్స్‌ను అమర్చిందట. ప్రస్తుతం ఆ యువతికి సంబంధించిన వీడియోలు,ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరలవుతున్నాయి. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, ఐపీఎస్‌, ఐఏఎస్‌ అధికారులు ఖుషి చేస్తున్న మంచి పనిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో తన వీడియోలను షేర్‌ చేస్తూ వైరల్‌ చేస్తున్నారు.

‘మా తాత, శ్రీ నాథ్ తివారీ( 68) మోటర్‌బైక్ కొనలేని కారణంగా ప్రతిరోజూ సైకిల్ వెళ్లేవారు. 2020లో ఒకరోజు రాత్రి ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు అవధ్‌ క్రాసింగ్ సమీపంలో వేగంగా వస్తోన్న కారు మా తాతను ఢీకొట్టింది. పొగమంచు బాగా కురుస్తుండడం, సైకిల్‌కు లైట్లు లేకపోవడమే ఈ ప్రమాదానికి కారణం. కారు డ్రైవర్‌ వెంటనే మా తాతను ఆస్పత్రికి తీసుకెళ్లాడు. కానీ అప్పటికే ఆలస్యమైంది. తాత కన్నుమూశారు. అందుకే ఇలా సైకిళ్లకు లైట్లు బిగిస్తున్నాను’ అని ఎమోషనలవుతోంది ఖుషి. కాగా ఖుషి సైకిళ్లకు బిగిస్తోన్న ఒక్కొక్క లైటు ఖరీదు సుమార 450 రూపాయలు. చదువుకుంటూనే రెండు చోట్ల పార్ట్‌ టైమ్‌ వర్క్‌ చేస్తూ ఇందుకు కావల్సిన మొత్తాన్ని సేకరిస్తోంది. లైట్లు ఉచితంగా అందించడమే కాకుండా అన్ని సైకిళ్లకు ఇటువంటి లైట్లను తప్పనిసరి చేయాలి అభ్యర్థిస్తూ రోడ్డు భద్రతా అధికారులకు లేఖ రాసింది. అన్నట్లు ఖుషీ వాలంటీర్ల సహాయంతో 82 మంది నిరుపేద విద్యార్థులకు చదువునందిస్తోంది. అంతేకాదు విద్యార్థినులకు అవసరమైన శానిటరీ నాప్‌కిన్‌లను కూడా పంపిణీ చేస్తుంది. యాసిడ్ దాడి బాధితుల కోసం ఆమె షెరోస్ కేఫ్‌లో వర్క్‌షాప్‌లను కూడా నిర్వహిస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం.. క్లిక్ చేయండి..