
ఇన్స్టాగ్రామ్లో స్నేహితురాలిగా ఉన్న 52 ఏళ్ల మహిళను 26 ఏళ్ల వ్యక్తి గొంతు కోసి చంపాడు. ఆమె తనను పెళ్లి చేసుకోవాలని బలవంతం చేయటం, తాను తీసుకున్న రూ. 1.5 లక్షలు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేయటం ఈ హత్యకు కారణంగా తెలిసింది. ఇన్ స్టా ఫిల్టర్లు వాడి 52 ఏళ్ల మహిళ తన వయసు దాచి 26 ఏళ్ల యువకుడితో ప్రేమాయణం నడిపింది. చివరికి అతడి చేతిలోనే దారుణ హత్యకు గురైంది. ఈ షాకింగ్ ఘటన ఉత్తరప్రదేశ్లోని మెయిన్పురిలో జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
మెయిన్పురికి చెందిన 26ఏళ్ల అరుణ్ రాజ్పుత్కు, ఫరూఖాబాద్ జిల్లాకు చెందిన 52ఏళ్ల రాణికి మధ్య ఇన్స్టాలో పరిచయం ఏర్పడింది. ఏడాదిన్నర క్రితం ఇన్స్టాగ్రామ్ వేదికగా ఏర్పడిన వీరి పరిచయం కాస్త ప్రేమగా మారింది. నలుగురు పిల్లల తల్లి అయిన రాణి ఫిల్టర్లు ఉపయోగించి తనను తాను చాలా చిన్న వయసు యువతిగా పరిచయం చేసుకుంది. ఆమె ఫొటోలు చూసి మోసపోయిన అరుణ్ ఆమెతో ప్రేమలో పడ్డాడు. తర్వాత ప్రత్యక్షంగా కలుసుకుని ఫరూఖాబాద్లోని పలు హోటళ్లలో కలుసుకునేవారు. ఈ క్రమంలోనే రాణి, అరుణ్కు సుమారు లక్షన్నర వరకు డబ్బులు కూడా ఇచ్చింది.
ఈ క్రమంలోనే ఆగస్టు 10న మెయిన్ పూరిలో వీరద్దరూ కలుసుకున్నారు. ఈ సందర్భంగా రాణి అరుణ్ని పెళ్లి చేసుకోవాలంటూ పట్టుబట్టింది. లేదంటే తను ఇచ్చిన డబ్బులు కూడా తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేసింది. ఈ క్రమంలోనే వారివురి మధ్య వాగ్వాదం జరిగింది. చివరకు ఆ గొడవతోనే రాణిని అరుణ్ హత్య చేసినట్టుగా పోలీసులు నిర్దారించారు.
ఆగస్టు 11న మెయిన్పురిలోని కర్పారి గ్రామంలో గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని గుర్తించారు పోలీసులు. శరీరంపై గొంతు కోసి చంపిన గుర్తులు ఉండటం గమనించారు. పోస్టుమార్టం అనంతరం పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇది హత్య అని నిర్ధారించారు. నిందితుడు ఉత్తరప్రదేశ్కు చెందిన అరుణ్ రాజ్పుత్ను పోలీసులు అరెస్టు చేశారు. విచారణలో అరుణ్ ఆమెను చున్నీతోనే గొంతు నులిమి హత్య చేసి అక్కడి నుంచి పారిపోయాడని నగర పోలీస్ చీఫ్ అరుణ్ కుమార్ సింగ్ తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..