వచ్చే వారం భారత్‌- అమెరికా భేటీ.. చైనా లక్ష్యంగా కీలక చర్చలు..

|

Oct 24, 2020 | 1:45 PM

తూర్పు లదాఖ్‌ సరిహద్దుల్లో నెలకొన్న ప్రతిష్టంభన పరిస్థితులను గమనిస్తున్నామని అమెరికా తెలిపింది. దక్షిణ చైనా సముద్రం సహా ఇండో పసిఫిక్‌ జలాల్లో దుందుడుకు వైఖరి ప్రదర్శిస్తున్న చైనాకు దీటుగా బదులిచ్చేందుకు భారత్‌తో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు అగ్రరాజ్యం అమెరికా మరోసారి స్పష్టం చేసింది.

వచ్చే వారం భారత్‌- అమెరికా భేటీ.. చైనా లక్ష్యంగా కీలక చర్చలు..
Follow us on

తూర్పు లదాఖ్‌ సరిహద్దుల్లో నెలకొన్న ప్రతిష్టంభన పరిస్థితులను గమనిస్తున్నామని అమెరికా తెలిపింది. దక్షిణ చైనా సముద్రం సహా ఇండో పసిఫిక్‌ జలాల్లో దుందుడుకు వైఖరి ప్రదర్శిస్తున్న చైనాకు దీటుగా బదులిచ్చేందుకు భారత్‌తో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు అగ్రరాజ్యం అమెరికా మరోసారి స్పష్టం చేసింది. ఆగ్నేయాసియాలో కీలక దేశమైన భారత్‌కు ఎల్లప్పుడు తమ మద్దతు ఉంటుందని పేర్కొంది.

2016 నుంచి ఇండియా తమ మేజర్‌ డిఫెన్స్‌ పార్టనర్‌గా మారిందని, గత నాలుగేళ్లుగా ఇరుదేశాల మధ్య రక్షణ రంగానికి సంబంధించిన కీలక ఒప్పందాలు జరిగినట్లు తెలిపింది. కాగా సైన్య సహకారం, పరస్పర సమాచార మార్పిడి తదితర అంశాలకు సంబంధించిన ఒప్పందాల గురించి భారత్‌- అమెరికాల మధ్య వచ్చే వారం 2+2 చర్చలు జరుగనున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా బేసిక్‌ ఎక్స్స్ఛేంజ్‌ అండ్‌ కో-ఆపరేషన్‌ అగ్రిమెంట్‌(బీఈసీఏ)పై భారత్‌ సంతకం చేయనుంది.

శత్రు దేశాలకు దీటుగా బదులిచ్చే క్రమంలో వారి స్థావరాలను గుర్తించి, దాడి చేసేందుకు ఉద్దేశించిన ఎంక్యూ- 9బి వంటి ఆర్మ్‌డ్‌ డ్రోన్స్‌ దిగుమతి తదితర అంశాల గురించి ఈ మేరకు అవగాహన ఒప్పందం చేసుకోనుంది భారత్. చర్చలు విజయవంతమైన తరుణంలో యూఎస్‌ గ్లోబల్‌ జియో-స్పేషియల్‌ మ్యాపులు ఉపయోగించి క్రూయిజ్‌ మిసైల్స్‌, బాలిస్టిక్‌ క్షిపణుల కచ్చితమైన జాడను తెలుసుకునేందుకు వీలవుతుంది. దీంతో దొంగ దెబ్బ తీయాలనుకునే శత్రు దేశాల వ్యూహాలను చిత్తు చేసి వారికి దీటుగా బదులిచ్చే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ట్రంప్‌ పాలనా యంత్రాంగంలోని సీనియర్‌ అధికారులు శనివారం మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.

ఇండో పసిఫిక్‌ ప్రాంతంలో చైనా దుందుడుకు చర్యలకు బదులిచ్చే క్రమంలో ఇండియా వంటి భాగస్వామితో కలిసి పనిచేయాల్సిన ఆవశ్యకత ఉంది. మలబార్‌ నావికాదళ విన్యాసాల్లో ఆస్ట్రేలియాతో జతకట్టనున్నట్లు ఇటీవల భారత్‌ చేసిన ప్రకటన పట్ల మాకెంతో సంతోషంగా ఉంది. భారత్‌కు మా మద్దతు ఉంటుంది. సైన్య సహకారం, పరస్పర సమాచార మార్పిడితో ముందుకు సాగుతామంటూ అమెరికా ఉన్నతాధికారి వెల్లడించారు.

త్వరలోనే జరుగనున్న చర్చల్లో భాగంగా, ఆగ్నేయాసియా ప్రాంతంలో పెట్టుబడులు, అభివృద్ధి కార్యక్రమాలు, దక్షిణ చైనా సముద్రం తదితర అంశాల్లో భారత్‌ భాగస్వామ్యం మరింతగా పెరగడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. తూర్పు లడాఖ్‌ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరగకుండా చూసుకోవాల్సిన ఆవశ్యకత కూడా ఉందన్నారు. కాగా కాగా పరస్పర సైన్య సహకారం, ఇండో- పసిఫిక్‌ జలాల్లో నిర్మాణాలు చేపట్టకుండా, అక్కడ జరుగుతున్న పరిణామాలపై ఓ కన్నేసి ఉంచి, పరస్పరం సహకరించుకునే క్రమంలో సమాచార మార్పిడి తదితర అంశాల్లో భారత్‌- అమెరికా ఇప్పటికే మూడు ప్రాథమిక ఒప్పందాలు కుదుర్చుకుంది.