Ashtadhatu Idols: కోట్లు విలువజేసే అష్టధాతు విగ్రహాలను దొంగలించిన దొంగలు.. పీడకలలు వస్తున్నాయని తిరిగి అప్పగింత
కొంతమంది దొంగలు తాము దొంగిలించిన 'అష్టధాతు' విగ్రహాలను తిరిగి పోలీసులకు అప్పగించారు. ఈ అరుదైన విచిత్రమైన ఘటన ఉత్తర్ ప్రదేశ్ లో(Uttarpradesh) చోటు చేసుకుంది.
Ashtadhatu Idols: మన మనసే మనకు పెద్ద కోర్టు.. మనం చేసిన ప్రతి పనిని అది ఎత్తిచూపుతుంది. అందుకు ఉదాహరణగా తాజాగా ఒక సంఘటన నిలిచింది. తాము నేరం చేసిన తర్వాత తమకు పీడకలలు వస్తున్నాయని పేర్కొంటూ కొంతమంది దొంగలు తాము దొంగిలించిన ‘అష్టధాతు’ విగ్రహాలను తిరిగి పోలీసులకు అప్పగించారు. ఈ అరుదైన విచిత్రమైన ఘటన ఉత్తర్ ప్రదేశ్ లో(Uttarpradesh) చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..
చిత్ర కూట్ తరౌన్హాలోని పురాతన బాలాజీ ఆలయంలో మే 9వ తేదీ రాత్రి కోట్ల విలువైన 16 అష్టధాతువుల విగ్రహాలు చోరీకి గురయ్యాయి. దీనికి సంబంధించిన ఆలయ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే ఇంతలో ఓ విచిత్ర ఘటన చోటు చేసుకుంది. ఈ విగ్రహాలను దొంగలించిన దొంగలు.. తమకు అప్పటి నించి నిద్రపట్టడం లేదంటూ.. ఆ విలువైన విగ్రహాలను ఆలయ పూజారికి తిరిగి ఇచ్చారని పోలీసులు సోమవారం తెలిపారు.
దీనికి సంబంధించి తాము గుర్తు తెలియని దొంగలపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు సదర్ కొత్వాలి కార్వీ స్టేషన్ హౌస్ ఆఫీసర్ రాజీవ్ కుమార్ సింగ్ తెలిపారు. దొంగిలించబడిన 16 విగ్రహాలలో 14 మహంత్ రాంబాలక్ నివాసం సమీపంలో గోనె సంచిలో రహస్యంగా దొరికాయని చెప్పాడు. పూజారికి ఒక గోనె సంచి.. దీంతోపాటు ఒక లేఖ దొరికింది. ఆ ఉత్తరంలో దొంగలు తమకు రాత్రిపూట భయానక కలలు వస్తున్నాయని వ్రాసారు. ఈ భయం కారణంగా తాము విగ్రహాలను తిరిగి ఇస్తున్నామని పేర్కొన్నారు. తమకు దొరికిన 14 ‘అష్టధాతు’ (ఎనిమిది లోహాలతో తయారు చేయబడిన) విగ్రహాలను కొత్వాలిలో భద్రపరిచినట్లు.. తదుపరి చర్యలు తీసుకుంటున్నామని ఆఫీసర్ రాజీవ్ కుమార్ తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..