Man-Eating Tiger: బీహార్‌లో నరభక్షక పులిని చంపేసిన అధికారులు.. ఊపిరి పీల్చుకున్న స్థానికులు..

బీహార్‌లోని పశ్చిమ చంపారన్ జిల్లాలోని బగహాలో ఉన్న వాల్మీకి టైగర్ రిజర్వ్‌లోని ఓ రాయల్‌ బెంగాల్‌ టైగర్‌ హడలెత్తిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు 9 మందిని చంపి తిన్నది.

Man-Eating Tiger: బీహార్‌లో నరభక్షక పులిని చంపేసిన అధికారులు.. ఊపిరి పీల్చుకున్న స్థానికులు..
Tiger

Updated on: Oct 08, 2022 | 4:54 PM

బీహార్‌లోని పశ్చిమ చంపారన్ జిల్లాలోని బగహాలో ఉన్న వాల్మీకి టైగర్ రిజర్వ్‌లోని ఓ రాయల్‌ బెంగాల్‌ టైగర్‌ హడలెత్తిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు 9 మందిని చంపి తిన్నది. ఎంతో మందిని పొట్టనబెట్టుకున్న పులిని చంపేందుకు 150 మందితో కూడిన అధికార యాత్రాంగం దాదాపు 15 రోజుల నుంచి విస్తృత ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో ప్రజలను హడలెత్తిస్తోన్న నరమాంస భక్షక పులిని.. అధికారులు ఎట్టకేలకు హతమార్చారు. శనివారం అధికారులు పులిని చంపేశారు. పలువురి ప్రాణాలను హరించిన ఈ పులిని పట్టుకునేందుకు అధికారులు ఎన్నోసార్లు విఫలయత్నమయ్యారు. దీంతో దానిని చంపాలని ఉన్నతాధికారులు ఆదేశాలివ్వడంతో పులి వేట కథకు పుల్ స్టాప్ పడింది. పులి మనుషులపైనే దాడులు చేస్తుండటంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జీవించారు. తాజాగా నరభక్షక పులిని అంతచేయడంతో అక్కడి గ్రామాలు ఊపిరి పీల్చుకున్నాయి.

పశ్చిమ చంపారన్ జిల్లాలోని బగాహాలో తొమ్మిది మందిని చంపిన ‘నరభక్షక’ పులిని చంపాలని ఆదేశాలు జారీ చేయడంతో హతమార్చినట్లు అధికారులు తెలిపారు. మనిషి రక్తం రుచి మరిగిన ఈ పులి.. నెల రోజుల్లో ఐదుగురి ప్రాణాలు తీసింది. ఇటీవల మూడు రోజుల్లోనే నలుగురి ప్రాణాలు బలి తీసుకుందని అధికారులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మానవ నివాసంలో జీవించడానికి అలవాటుపడిందని నిర్ధారించుకున్న తర్వాత పులిని చంపడానికి ఆదేశాలు జారీ చేస్తామని చంపారన్ డీఎఫ్ఓ తెలిపారు. గత 3 రోజుల్లోనే పులి నలుగురిని చంపిందని DFO తెలిపారు.

కాగా.. ఈ పులి వేట కోసం.. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ షూటర్ నవాబ్ షఫత్ అలీఖాన్‌, అతని కొడుకు నవాబ్‌ అస్ఘర్‌ అలీ ఖాన్‌ను సైతం అక్కడి అధికారులు రంగంలోకి దించారు. ఇటీవల పులిని పట్టుకునేందుకు ఓ మేకను బోనులో పెట్టి కాపుకాయగా.. అక్కడకు వచ్చిన పులి అందరూ చూస్తుండగానే మేకను నోట కరుచుకుని పోయింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..