ప్రముఖ సినీ నటి అమలా పాల్ కు చేదు అనుభవం ఎదురైంది. కేరళలోని ఎర్నాకులంలోని తిరువైరాణికుళం మహాదేవ ఆలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన ఆమెను ఆలయ అధికారులు అడ్డుకున్నారు. మత వివక్ష కారణంగా తనకు అనుమతి నిరాకరించారని నటి అమలా పాల్ ఆరోపించారు. ఆలయంలోకి హిందువులను మాత్రమే అనుమతించే ఆచారాల కారణంగా దర్శనం నిరాకరించారని వాపోయారు. అంతే కాకుండా బయటి నుంచే అమ్మవారి దర్శనం చేసుకోవాలని బలవంతం చేశారని చెప్పారు. అమ్మవారిని చూడనప్పటికీ తాను ఆత్మసంతృప్తి చెందినట్లు ఆలయ సందర్శకుల రిజిస్టర్లో తన అనుభవాన్ని పంచుకున్నారు అమలా పాల్.
“2023లో మతపరమైన వివక్ష ఇంకా కొనసాగడం విచారకరం. ఇది చాలా నిరాశ కలిగించింది. దేవత దగ్గరికి వెళ్లలేకపోయాను, కానీ దూరం నుంచి అమ్మవారిని మొక్కుకున్నాను. త్వరలో మతపరమైన వివక్షలో మార్పు వస్తుందని ఆశిస్తున్నాను. అందుకు తగిన సమయం వస్తుంది. మత ప్రాతిపదికన కాకుండా అందరినీ సమానంగా చూసే రోజు త్వరలోనే రావాలి’
– అమలాపాల్, సినీ నటి
దీంతో మహాదేవ ఆలయ ట్రస్ట్ పేరు చర్చనీయాంశంగా మారింది. దీనిపై స్పందించిన అధికారులు.. తాము ప్రొటోకాల్ ను మాత్రమే పాటిస్తున్నామని తెలిపారు. ఇతర మతాలకు చెందిన భక్తులు చాలా మంది ఆలయాన్ని సందర్శించేందుకు వస్తున్నారని, అయితే ఆ విషయం ఎవరికీ తెలియదని చెప్పారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..