తీవ్ర వాదోపవాదాలు, ఉత్కంఠ మధ్య తమిళనాడు(Tamil Nadu) మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి అన్నాడీఎంకేలో(AIADMK) ఆధిపత్యం చాటుకున్నారు. దివంగత నేత, తమిళనాడు మాజీ సీఎం జయలలిత(Jayalalithaa) మరణం తర్వాత అన్నాడీఎంకేలో ప్రధాన కార్యదర్శి పదవిని రద్దు చేశారు. దానికి పన్నీర్సెల్వం సమన్వయకర్తగా, పళనిస్వామి సంయుక్త సమన్వయకర్తగా కొనసాగుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఇద్దరు తీసుకుంటున్న వేర్వేరు నిర్ణయాలతో సమస్య ఏర్పడింది. దీనిని పరిష్కరించుకునేందుకు పార్టీ సర్వసభ్య సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. దానిపై చర్చించేందుకు ఈ నెల 14న జిల్లా కార్యదర్శుల సమావేశం జరిగింది. అందులో పళనిస్వామి మద్దతుదారులు ఏక నాయకత్వ వ్యవహారంపై మాట్లాడారు. దీనికి పన్నీర్సెల్వం వర్గీయులు ఒప్పుకోలేదు. పరిస్థితి ఎంతగా మారిందంటే.. వీరి వివాదం కోర్టుకు సైతం వెళ్లింది. కోర్టు ఆదేశాల కారణంగా ఏక నాయకత్వ తీర్మానం ప్రవేశపెట్టేందుకు పళనిస్వామి వర్గానికి కుదరలేదు.
కాగా.. తదుపరి సమావేశం జులై 11న జరగనుంది. ఆ సమావేశంలో ఏక నాయకత్వ తీర్మానం తెచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు హైడ్రామా తర్వాత గురువారం జరిగిన అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశంలో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. రెండాకుల పార్టీలో ఈపీఎస్, ఓపీస్ వర్గాల మధ్య తీవ్ర విభేదాలు భగ్గుమన్నాయి. ఈ సమావేశం నిర్వహించాలని పళని స్వామి వర్గం ప్లాన్ చేస్తే, దాన్ని అడ్డుకునేందుకు పన్నీర్ సెల్వం వర్గం చివరి వరకు ప్రయత్నించింది. మద్రాస్ హైకోర్టులో అర్ధరాత్రి అత్యవసర పిటిషన్ దాఖలు చేసింది. మీటింగ్ను ఆపలేకపోయినా తనకు కావాల్సింది సాధించుకున్నారు పన్నీర్ సెల్వం. పార్టీ అధినేత ఎన్నిక జరగకుండా చూడాలన్న పన్నీర్ విజ్ఞప్తి అనుకూలంగా కోర్టు ఆదేశాలు వచ్చాయి.
ఏక నాయకత్వ అంశం ప్రస్తావనకు వచ్చినప్పుడు పళని వర్గీయులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఇది పన్నీర్కు, ఆయన వర్గీయులకు నచ్చలేదు. సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్టు పన్నీర్ అనుచరుడు మైక్లో ప్రకటించారు. అనంతరం వేదిక దిగి వెళ్లబోతున్న పన్నీర్పైకి కింద నుంచి ఈపీఎస్ వర్గీయులు వాటర్ బాటిళ్లు విసిరారు. దీంతో పన్నీర్కు ఆయన అనుచరులు, సెక్యూరిటీ రక్షణగా నిలిచి బయటకు తీసుకెళ్లారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో మరోసారి జూలై 11న పార్టీ సమావేశం జరగనుంది.