Monkeypox: మంకీపాక్స్ అలర్ట్.. దేశంలో మరో అనుమానిత కేసు..

|

Sep 18, 2024 | 10:03 AM

మంకీపాక్స్ వైరస్ ప్రపంచవ్యాప్తంగా వేగంగా వ్యాపిస్తోంది. ఆఫ్రికా, యూరోపియన్ దేశాలను వణికించిన ఈ వైరస్‌... ఇప్పుడు భారత్‌లోకి ప్రవేశించింది. భారత్‌లో తొలి మంకీ పాక్స్‌ కేసు నమోదైన విషయం తెలిసిందే.. ఈ క్రమంలోనే మరో అనుమానిత కేసు కేరళలోని మలప్పురంలో వెలుగులోకి వచ్చింది.

Monkeypox: మంకీపాక్స్ అలర్ట్.. దేశంలో మరో అనుమానిత కేసు..
Monkeypox
Follow us on

మంకీపాక్స్ వైరస్ ప్రపంచవ్యాప్తంగా వేగంగా వ్యాపిస్తోంది. ఆఫ్రికా, యూరోపియన్ దేశాలను వణికించిన ఈ వైరస్‌… ఇప్పుడు భారత్‌లోకి ప్రవేశించింది. భారత్‌లో తొలి మంకీ పాక్స్‌ కేసు నమోదైన విషయం తెలిసిందే.. ఈ క్రమంలోనే మరో అనుమానిత కేసు కేరళలోని మలప్పురంలో వెలుగులోకి వచ్చింది. లక్షణాలను గుర్తించిన అధికారులు వెంటనే అతన్ని ఐసోలేషన్ కేంద్రానికి తరలించారు. కేరళలోని మలప్పురం జిల్లాలో ఇటీవల విదేశాల నుండి తిరిగి వచ్చిన వ్యక్తి ఆసుపత్రిలో చేరాడు.. అతని లక్షణాలను బట్టి అనుమానాస్పద కేసుగా గుర్తించారు.

కొద్దిరోజుల క్రితం కేరళకు వచ్చిన రోగిని తొలుత ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరాడు.. తర్వాత ఎంపాక్స్ వ్యాధి ఉన్నట్లు వైద్యులు అనుమానించడంతో మంజేరి మెడికల్ కాలేజీకి తరలించామని జిల్లా ఆరోగ్య అధికారి పేర్కొన్నారు. నమూనాలను సేకరించి పరీక్ష కోసం కోజికోడ్ మెడికల్ కాలేజీకి పంపారు. ఫలితాలు రావాల్సి ఉంది.

ఢిల్లీలో ఇటీవల ఒకరికి మంకీ పాక్స్ లక్షణాలను గుర్తించారు. హర్యానాలోని హిసార్‌కు చెందిన 26 ఏళ్ల వ్యక్తికి టెస్టుల్లో రోగిలో వెస్ట్ ఆఫ్రికన్ క్లేడ్‌ 2 మంకీపాక్స్ వైరస్ ఉనికిని గుర్తించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. మంకీపాక్స్ సోకిన వ్యక్తి ఢిల్లీలోని ఐసోలేషన్‌ సెంటర్‌లో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది.

కాగా.. ఇప్పటికే తొలి మంకీపాక్స్ కేసు నమోదు కావడంతో.. కేంద్రం రాష్ట్రాలను అలర్ట్ చేసింది. ఎయిర్‌పోర్టులు, ఓడరేవుల ద్వారా దేశంలోకి ప్రవేశించే వారిని క్షుణ్ణంగా పరిశీలించాలని ఆదేశాలు జారీ చేసింది. మంకీపాక్స్‌ వైరస్‌ను గుర్తించేందుకు వీలుగా దేశంలో 32 ప్రత్యేక లాబ్స్‌, ఐసోలేషన్ కేంద్రాలను ఏర్పాటు చేసింది.

WHO మంకీపాక్స్‌ని పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్ కన్సర్న్ (PHEIC)గా ప్రకటించింది. ముఖ్యంగా ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాలలో దాని వ్యాప్తి కొనసాగుతోంది. సుదీర్ఘ సన్నిహిత పరిచయం ద్వారా సంక్రమించే వైరస్ సాధారణంగా జ్వరం, దద్దుర్లు, వాపు శోషరస కణుపులతో వ్యక్తమవుతుంది. ఈ లక్షణాలు కొన్ని వారాల పాటు ఉంటాయి..

కాగా, కేరళలో అటు నిఫా.. ఇటు మంకీపాక్స్ అలజడి కలకలం రేపింది. ఇటీవల రాష్ట్రంలో నిపా వ్యాప్తి పెరిగింది. సెప్టెంబర్ 9న నిపా వైరస్ కారణంగా 24 ఏళ్ల యువకుడు మరణించిన నేపథ్యంలో జిల్లాలో కంటైన్‌మెంట్ జోన్‌లు ఏర్పాటు చేసి చర్యలు తీసుకుంటున్నారు. కేరళలో కొనసాగుతున్న ప్రజారోగ్య ప్రయత్నాల్లో భాగంగా మంకీపాక్స్, నిపా ఇన్‌ఫెక్షన్‌లను అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..