Hijab – Supreme Court: కర్ణాటక రాష్ట్రాన్నే కాకుండా దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైన హిజాబ్ అంశంపై అత్యవసర విచారణ జరుపాలనే పిటిషన్ను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. కర్ణాటక హైకోర్టులో విచారణ జరుగుతున్నందున దీంటో జోక్యం చేసుకునేది లేదంటూ స్పష్టం చేసింది. అంతేకాదు.. ఈ అంశాన్ని జాతీయ సమస్యగా మార్చడం సరికాదంటూ చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు.
కాగా, కర్ణాటక రాష్ట్రంలో తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసిన హిజాబ్ అంశం రాష్ట్ర హైకోర్టును దాటి దేశ అత్యున్నత న్యాయస్థానానికి చేరింది. ఈ అంశంపై విచారణ ముగిసే వరకు ఎవరూ మతపరమైన వస్త్రధారణతో రావద్దని కర్ణాటక హైకోర్టు జారీ చేసిన మధ్యంతర ఆదేశాలను సవాలు చేస్తూ ఫాతిమా బుష్రా అనే విద్యార్థి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. హిజాబ్ ధరించడం రాజ్యాంగం ఇచ్చిన హక్కని, హైకోర్టు ఆదేశం ఆ హక్కును ఉల్లంఘిస్తోందని వాదించారు. తమకు ఫిబ్రవరి 15 నుంచి ప్రాక్టికల్ పరీక్షలు ఉన్నందున విద్యాసంస్థల్లో తమకు ఆటంకం లేని ప్రవేశం ఉండేలా చూడాలని ఆమె తన పిటిషన్లో అభ్యర్థించారు. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపించారు. ఈ అంశం దేశవ్యాప్తంగా వ్యాపిస్తోందని న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. అయితే కర్ణాటక హైకోర్టు ఇంకా తుది ఆదేశాలు ఇవ్వకుండానే సుప్రీం కోర్టులో ఎలా సవాలు చేస్తారని ప్రశ్నించారు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా… దీన్ని రాజకీయం, మతపరం చేయొదన్నారు.
ఈ వాదనలపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ స్పందిస్తూ.. కర్ణాటక హైకోర్టులో హిజాబ్ అంశంపై విచారణ జరుగుతోందని, తుది ఆదేశాలు వెలువడక ముందే తాము కల్పించుకోలేమని స్పష్టం చేశారు. సున్నితమైన ఈ అంశాన్ని పెద్దది చేయొద్దన్నారు. దీన్ని జాతీయ స్థాయికి తీసుకురావడం సరైందేనా? ఒక్కసారి ఆలోచించండి అని వ్యాఖ్యానించారు చీఫ్ జస్టిస్. అసలు ఏం జరుగుతోందో తమకు తెలుసునని, దేశ పౌరులు అందరి ప్రాథమిక హక్కులను కాపాడేందుకే మేము ఇక్కడ ఉన్నామని అన్నారు. సరైన సమయంలో తప్పకుండా వాదనలు వింటాం అని స్పష్టం చేశారు సీజే ఎన్వీ రమణ.
Also read:
Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట ఫస్ట్ లిరికల్ సాంగ్ ప్రోమో.. మహేష్ కళావతి సాంగ్ అదుర్స్..
EPFO: పీఎఫ్ ఖాతాదారులకు గుడ్న్యూస్.. త్వరలో పెన్షన్ పెరిగే అవకాశం..!