
నీట్ పేపర్ లీక్కు నిరసనగా.. ప్రముఖ విద్యావేత్త, సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ చేస్తున్న నిరహార దీక్ష భగ్నమైంది. నీట్ పేపర్ లీక్కు బాధ్యత వహిస్తూ.. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ.. దేశరాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధీక్షకు దిగారు సోనమ్ వాంగ్చుక్. అయితే గత 20 రోజులుగా కేవలం ఉప్పు నీరు మాత్రమే తీసుకుంటూ దీక్ష చేయడం వల్ల ఆయన సుమారు 9 కేజీల బరువు తగ్గారని, శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరిగి కండరాల క్షీణత మొదలైందని వైద్య నిపుణులు పేర్కొన్నారు.. ఈ నేపథ్యంలో, ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు, వైద్యుల సలహా మేరకు ఆయనకు అత్యవసర చికిత్స అందించేందుకు పోలీసులు బలవంతంగా ఆయన్ను సఫ్దర్జంగ్ ఆసుపత్రికి తరలించారు
ప్రస్తుతం సోనమ్ వాంగ్చుక్ వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. సోనమ్ వాంగ్చుక్ను ఆసుపత్రికి తరలించిన అనంతరం, జంతర్ మంతర్ వద్ద ఉన్న నిరసనకారులను పోలీసులు నిరసన స్థలాన్ని శాంతియుతంగా ఖాళీ చేయాలని ఆదేశించారు. ఈ క్రమంలో కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపక అధ్యక్షుడు అభిజిత్ దీప్కేతో పాటు పలువురు నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జంతర్ మంతర్ పరిసరాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా భద్రతా బలగాలను మోహరించారు
పోలీసులు కాదు గుండాలు- భిజిత్ దీప్కే
పోలీసుల తీరుపై కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు అభిజిత్ దీప్కే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ప్రజాస్వామ్య విరుద్ధమని, పోలీసులు గూండాల వలె ప్రవర్తించారని ఆయన ఆరోపించారు..ఉదయం 7 గంటలకు తాను స్నానం చేసి రావడానికి బయటకు వచ్చినప్పుడు, పోలీసు గూండాలు వచ్చారని సోనమ్ సార్ను తిడుతూ ఈడ్చుకెళ్లారన్నారు. 20 రోజులుగా నిరాహార దీక్ష చేస్తూ, ఒక్క ముద్ద కూడా తినని 60 ఏళ్ల వృద్ధుడిని ఢిల్లీ పోలీసులు బలవంతంగా తీసుకెళ్లారని మండి పడ్డారు. తాను జంతర్ మంతర్కు వెళ్తుండగా, పోలీసులు తమపై కూడా దాడి చేశారని ఆరోపించారు. వీళ్ళు పోలీసు అధికారులు కాదు.. ఆర్ఎస్ఎస్ గూండాలన్నారు. తాను విదేశాల నుంచి దేశానికి తిరిగి వచ్చానని తనేమైనా నేరస్థుడినా అని ప్రశ్నించారు.
జూలై 20న ఛలో పార్లమెంట్’ మార్చ్
దీక్షకు ముందు సోనమ్ వాంగ్చుక్ ఒక వీడియో సందేశాన్ని విడుదల చేస్తూ జూలై 20న నిర్వహించనున్న పార్లమెంట్ మార్చ్ లో ప్రజలంతా పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఉల్లిపాయల ధరల విషయంలోనే ప్రభుత్వాలు మారినప్పుడు, దేశంలోని లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని ఆయన ప్రశ్నించారు. ఇది ఇప్పుడు దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
వీడియో చూడండి..
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.