Pahalgam Terror Attack: హృదయవిదారకం.. జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రదాడిని ఖండించిన ఆర్‌ఎస్‌ఎస్‌

Pahalgam Terror Attack: జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఉగ్రవాదులు పేట్రేగిపోయారు. అనంత్‌నాగ్‌ జిల్లా పహల్గాంలో పర్యాటకులే లక్ష్యంగా దాడులకు తెగబడ్డారు. మినీ స్విట్జర్లాండ్‌గా పేరొందిన బైసరన్‌ ప్రాంతంలో విహారానికి వచ్చినవారిపై పాశవిక దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 30మంది పర్యటకులు ప్రాణాలు కోల్పోగా.. మరో 20 మంది పరిస్థితి విషమంగా ..

Pahalgam Terror Attack: హృదయవిదారకం.. జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రదాడిని ఖండించిన ఆర్‌ఎస్‌ఎస్‌

Updated on: Apr 22, 2025 | 10:03 PM

జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో పర్యాటకులపై జరిగిన ఉగ్రవాద దాడిని తీవ్రంగా ఖండించింది రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS). ఈ దాడి అత్యంత దారుణమని, హృదయ విదారకమైనదని ఆర్‌ఎస్‌ఎస్‌ కీలక నేత దత్తాత్రేయ హోసబాలే పేర్కొన్నారు. మరణించినవారికి ఆర్‌ఎస్‌ఎస్‌ నివాళులు అర్పించింది. ఈ దాడిలో గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నామని తెలిపింది. ఇది మన దేశ ఐక్యత, సమగ్రతపై దాడి. అన్ని రాజకీయ పార్టీలు, సంఘాలు తమ విభేదాలకు అతీతంగా ఈ ఉగ్రవాద చర్యను ఖండించాలని ఆర్‌ఎస్‌ఎస్‌ పిలుపునిచ్చింది. ప్రభుత్వం బాధిత కుటుంబాలకు అవసరమైన అన్ని సహాయాలు, సహాయాన్ని నిర్ధారించాలని, ఈ దాడికి కారణమైన వ్యక్తులకు తగిన శిక్ష విధించేలా చూడాలని తెలిపింది.

ఇదిలా ఉండగా, ఈ ఘటనలో ఉగ్రవాదులు పేట్రేగిపోయారు. అనంత్‌నాగ్‌ జిల్లా పహల్గాంలో పర్యాటకులే లక్ష్యంగా దాడులకు తెగబడ్డారు. మినీ స్విట్జర్లాండ్‌గా పేరొందిన బైసరన్‌ ప్రాంతంలో విహారానికి వచ్చినవారిపై పాశవిక దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 30మంది పర్యటకులు ప్రాణాలు కోల్పోగా.. మరో 20 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల కాలంలో అతిపెద్ద ఉగ్ర ఘటన ఇదేనన్నారు ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా .

మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో బైసరన్‌ ప్రాంతంలో ఉన్న దాదాపు 40 మంది పర్యటకులను అటవీ ప్రాంతం నుంచి వచ్చిన ఉగ్రవాదులు ఒక్కసారిగా చుట్టుముట్టారు. అనంతరం విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడ్డారు. దీంతో కొంతమంది అక్కడికక్కడే కుప్పకూలగా.. అనేక మంది తీవ్ర గాయాలపాలయ్యారు. రక్తపు మడుగులో పడిఉన్న మృతదేహాలతో స్థానికంగా భీతావహ వాతావరణం నెలకొంది. ఈ ప్రాంతానికి కేవలం కాలినడకన లేదా గుర్రాలపై మాత్రమే చేరుకునే అవకాశం ఉండటంతో బాధితులను తరలించడం కష్టమైంది.

 


కాల్పుల శబ్దం వినిపించడంతో వెంటనే అప్రమత్తమైన భద్రతా బలగాలు హుటాహుటిన ఘటనా ప్రాంతానికి తరలివెళ్లాయి. గాయపడిన వారిని హెలికాప్టర్‌ ద్వారా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే స్థానికులు గుర్రాల సాయంతో పలువురిని తీసుకెళ్లినట్లు సమాచారం. గాయపడిన వారిలో మరికొందరి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు సమాచారం.

మోదీ ఆదేశాలతో హుటాహుటిన కశ్మీర్‌కి చేరుకున్నారు హోం మంత్రి అమిత్‌షా. భద్రతా దళాల అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలన్నారు. కశ్మీర్‌ చేరిన వెంటనే ఉన్నతాధికారులు అత్యవసర సమావేశం నిర్వహించారు అమిత్‌షా.

జమ్ముకశ్మీర్‌ ఉగ్రదాడిని ఖండించారు ప్రధాని మోదీ.. దాడి చేసినవారిని విడిచిపెట్టేది లేదంటూ ట్వీట్‌ చేశారు. మృతుల కుటుంబాలకు ప్రధాని మోదీ సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బాధితులకు సహాయ సహకారాలు అందిస్తామన్న మోదీ.. ఈ హేయమైన చర్య వెనుక ఉన్న వారిని న్యాయస్థానం ముందు నిలబెడతామన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి