
భారత్లో విలీనం కావాలని పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రజల నుంచే స్వయంగా డిమాండ్లు వస్తున్నాయని భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. పీవోకే ప్రజలు భారత్లో విలీనం అవుతారనే విశ్వాసం తనకు ఉందన్నారు. హోలీ సందర్భంగా లద్ధాఖ్లోని లేహ్ సైనిక స్థావరాన్ని రాజ్నాథ్ సింగ్ సందర్శించారు. సైనికులతో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు. ఢిల్లీ దేశ రాజధాని, ముంబై ఆర్థిక రాజధాని అయితే లద్ధాఖ్ మన శౌర్యానికి రాజధాని అని అభివర్ణించారు. కాశ్మీర్పై పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్సింగ్ స్పందించారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తాను దాదాపు ఏడాదిన్నర క్రితమే చెప్పానన్నారు. ఎందుకంటే భారత్ పై దాడి చేసి ఆక్రమించుకోవాలనుకుంటే అక్కడి ప్రజలు భారత్లో విలీనాన్ని కోరుకుంటున్నారని తెలిపారు. పైగా కాశ్మీర్ ప్రజలు దీనిపై గట్టిగా డిమాండ్ చేసే పరిస్థితి ఏర్పడుతోందని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితులపై ప్రభుత్వం ఏదైనా ప్రణాళిక రూపొందిస్తోందా అంటే.. ఇప్పటి వరకు ఎలాంటి ఆలోచనలు లేవన్నారు.
భారత్ ఏ దేశంపైనా దాడి చేయాలనుకోవడం లేదని స్పష్టం చేశారు. అలాగే భారత్ పై ఎవరైనా దాడి చేయాలని ప్రయత్నిస్తే వాళ్ళకు తగిన గుణపాఠం చెబుతారన్నారు. ఒక్క పాకిస్తానే కాదు.. ప్రపంచంలో ఏ దేశంపైనా దాడి చేయాలనే ఉద్దేశం భారత్కు లేదని వివరించారు. అయితే పాక్ ఇతరుల భూభాగాన్ని ఆక్రమించినప్పటకీ పీవోకే స్వయంగా భారత్లో విలీనం అవుతుందని తనకు నమ్మకం ఉన్నట్లు వెల్లడించారు. భారత్ కు పొరుగువారితో మంచి సంబంధాలు ఉన్నాయి. తాము కూడా ఈ సంబంధాలను కొనసాగించాలనుకుంటున్నామన్నారు. అయితే దేశ ఆత్మగౌరవాన్ని పణంగా పెట్టి కాదు అని వివరించారు. ఎవరైనా భారతదేశ ప్రతిష్టపై దాడి చేస్తే, దానికి తగిన సమాధానం చెప్పే శక్తి తమ దేశానికి ఉందన్నారు. ఇప్పటికిప్పుడు చైనా నుంచి ఎలాంటి ముప్పు వచ్చినా భారత్ ఎదుర్కొంటుందని ఆయన స్పష్టం చేశారు. భారతదేశం ప్రపంచంలోనే శక్తివంతమైన దేశంగా ఎదిగిందని ఉద్ఘాటించారు. పొరుగు దేశాలతో స్నేహ సంబంధాలు కొనసాగించడం మంచిదని నాడు అటల్ జీ చెప్పేవారన్నారు. అయితే పొరుగు వారు ఇలా ఆలోచించరు అని వాజ్పేయి చెప్పిన వ్యాఖ్యలను గుర్తు చేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..