Rahul Gandhi: ఢిల్లీలో అధికార నివాసాన్ని ఖాళీ చేసిన రాహుల్‌గాంధీ.. 2 ట్రక్కుల్లో సామాన్లతో తల్లి సోనియా ఇంటికి..

కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ తన అధికారిక నివాసాన్ని ఖాళీ చేయడం ప్రారంభించారు. శుక్రవారం (ఏప్రిల్ 14) తన ఇంటి నుంచి ట్రక్కుతో సరుకులు బయటకు వెళ్లడం కనిపించింది. మోదీ ఇంటిపేరు వ్యాఖ్య కేసులో రాహుల్ గాంధీకి సూరత్ కోర్టు మార్చి 23న రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ఆ తర్వాత ఆయన పార్లమెంటు సభ్యత్వం రద్దయింది.

Rahul Gandhi: ఢిల్లీలో అధికార నివాసాన్ని ఖాళీ చేసిన రాహుల్‌గాంధీ.. 2 ట్రక్కుల్లో సామాన్లతో తల్లి సోనియా ఇంటికి..
Rahul Gandhi

Updated on: Apr 14, 2023 | 8:49 PM

లోక్‌సభ ఎంపీగా అనర్హత వేటు పడటంతో రాహుల్ గాంధీ ఢిల్లీలో తనకు కేటాయించిన అధికారిక నివాసాన్ని ఖాళీ చేశారు. 2004లో అమేథీ నుంచి తొలిసారిగా ఎంపీగా గెలిచాక 2005లో రాహుల్‌కి ఈ బంగ్లా కేటాయించారు. తుగ్లక్ లేన్‌-12లో ఈ బంగ్లాలోనే ఇప్పటి వరకూ రాహుల్‌ ఉండేవారు. 10 జన్‌పథ్‌లో సోనియా గాంధీ ఉంటున్నా.. రాహుల్‌ మాత్రం ఇక్కడి నుంచే తన కార్యక్రమాలను కొనసాగించేవారు. ఈ బంగ్లా నుంచి ఖాళీ చేసేందుకు లోక్‌సభ సెక్రటేరియట్‌ ఏప్రిల్ 22 వరకూ గడువు ఇవ్వడంతో.. ఈ లోపే అక్కడి నుంచి సమాన్లు సర్దుకుని తల్లి ఇంటికి వెళ్లిపోయారు. మొత్తం 2 ట్రక్కుల్లో తన సామాన్లు పట్టుకెళ్లారు రాహుల్‌. సుదీర్ఘకాలంగా ఇక్కడే ఉంటున్న తనకు సొంత ఇల్లు లేదని, అలాగని ఈ బంగ్లాతో ప్రత్యేకమైన అటాచ్‌మెంట్‌ కూడా ఏమీ లేదని అన్నారు.

రాహుల్‌కి ఇష్టమైతే తమ బంగ్లాలో ఉండొచ్చని, తాము మరో చోటికి మారతామని చాలా మంది కాంగ్రెస్‌ నేతలు ఆఫర్‌ ఇచ్చినా ఆయన సున్నితంగా తిరస్కరించారు. బీజేపీ తాను ఉంటున్న ఇల్లు ఖాళీ చేయించినా, జైల్లో వేసినా తాను ప్రజల పక్షానే ఉంటానంటూ రాహుల్‌ ఈమధ్యే వయనాడ్‌ పర్యటనలో చెప్పుకొచ్చారు. నాలుగేళ్ల కింద కర్నాటకలోని కోలార్‌లోని ఓ ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. ఆయనపై సూరత్‌ కోర్టులో పరువునష్టం దావా కూడా పడింది.

చివరికి కోర్టు 2 ఏళ్ల శిక్ష విధించడంతో ఆయన లోక్‌సభ సభ్యత్వం రద్దయ్యింది. ఆ తర్వాత దీనిపై ఆయన స్టే తెచ్చుకున్నా.. లోక్‌సభ సెక్రటేరియట్‌ తీసుకున్న అనర్హత నిర్ణయం ఇంకా అమల్లోనే ఉంది. ఈ నేపథ్యంలో ఆయన ఇల్లు ఖాళీ చేశారు. మార్చి 23న అనర్హత వేటు పడిన నేపథ్యంలో ఆయన బంగ్లా వెకేట్‌ చేసేందుకు నెల రోజులు అంటే ఏప్రిల్ 22 వరకూ టైమిచ్చారు. ఈ నోటీసుల నేపథ్యంలో ఇవాళ ఖాళీ చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం