Pune Accident: పూణె-షోలాపూర్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. బోల్తా పడిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు..
పూణె-షోలాపూర్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బోల్తా పడింది. ఈ ఘటనలో 12 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.
పూణె-షోలాపూర్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బోల్తా పడింది. ఈ ఘటనలో 12 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ బస్సు ముంబై నుంచి నిజామాబాద్కు వస్తుండగా ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో 50-60 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. దౌండ్లోని భండ్గావ్ గ్రామ సమీపంలో పూణె-సోలాపూర్ హైవేపై ద్విచక్రవాహనం అడ్డు రాగా, దాన్ని తప్పించే ప్రయత్నంలో ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ముంబై నుంచి నిజామాబాద్కు వెళ్తుండగా రాత్రి 8.30 గంటల ప్రాంతంలో బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 12 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడగా.. మరికొంతమందికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఎవరికీ ప్రాణాపాయం లేదని, అందరి ఆరోగ్యం నిలకడగానే ఉందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.
కాగా, ప్రమాదం తరువాత బస్సు డ్రైవర్ అక్కడి నుంచి పారిపోయినట్లు బస్సులోని మిగతా ప్రయాణికులు తెలిపారు. ఇక ఈ ప్రమాదంలో హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. రోడ్డుకు ఇరువైపులా కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని రోడ్డుకు అడ్డంగా పడిన బస్సును తొలగించారు. ట్రాఫిక్ జామ్ను క్లియర్ చేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..