Priyanka Gandhi: నూతన వ్యవసాయ చట్టాలు, రైతుల ఆందోళన విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రధానమంత్రికి పాకిస్తాన్, చైనా వెళ్లడానికి సమయం ఉంటుంది.. కానీ తన సొంత నియోజకవర్గ సరిహద్దు ప్రాంతాలను సందర్శించడానికి.. రైతులను కలవడానికి సమయం లేదంటూ ఆమె విమర్శించారు. ఈ మేరకు ప్రియాంక గాంధీ బుధవారం సహరణ్పూర్లో నిర్వహించిన ‘కిసాన్ మహా పంచాయత్’ సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే కొత్త చట్టాలను రద్దు చేస్తామన్నారు. మూడు కొత్త చట్టాలు కూడా రైతులకు హానికరమైనవేనని ప్రియాంక గాంధీ వెల్లడించారు.
పార్లమెంటులో ప్రధాని స్వయంగా రైతులను అవమానించారని.. వారిని ‘ఆందోళన జీవి’ అంటూ ఎగతాళి చేశారని గుర్తుచేశారు. ఆయన మాదిరిగానే బీజేపీ నేతలంతా రైతులను అవమానిస్తున్నారని ప్రియాంక ఆగ్రహం వ్యక్తంచేశారు. కాగా.. రైతుల ఆందోళనలకు మద్దతుగా ‘జై జవాన్.. జై కిసాన్’ పేరిట కాంగ్రెస్ ఉత్తరప్రదేశ్లోని 27 జిల్లాల్లో 10 రోజుల పాటు ‘కిసాన్ పంచాయతీ’ ర్యాలీలు నిర్వహించనుంది.
Also Read: