App vs Bjp: ఢిల్లీలో బీజేపీ ధర్నా.. గుజరాత్లో దూసుకుపోతున్న ఆమ్ ఆద్మీ.. రంజుమీదున్న రాజకీయం..
App vs Bjp: బీజేపీ - ఆమ్ఆద్మీ మధ్య రాజకీయ వేడి పీక్స్కు చేరింది. ఢిల్లీలో బీజేపీ ధర్నాకు కూర్చోగా.. గుజరాత్లో సైలెంట్గా పనికానిచ్చేస్తోంది ఆమ్ఆద్మీ.
App vs Bjp: బీజేపీ – ఆమ్ఆద్మీ మధ్య రాజకీయ వేడి పీక్స్కు చేరింది. ఢిల్లీలో బీజేపీ ధర్నాకు కూర్చోగా.. గుజరాత్లో సైలెంట్గా పనికానిచ్చేస్తోంది ఆమ్ఆద్మీ. గుజరాత్లో త్వరలో ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. దీన్ని దృష్టిలో ఉంచుకుని, ఆమ్ఆద్మీ అధినేత కేజ్రీవాల్- హామీల మీద హామీలు గుప్పిస్తున్నారు. ఉద్యోగాలు కోల్పోయిన వారందరికీ ఉద్యోగాలు ఇస్తామని సోమ్నాథ్లో జరిగిన సభలో ప్రకటించారు. ఒకవేళ తాము ఉద్యోగాలు ఇవ్వలేకపోతే నిరుద్యోగ భృతి కింద నెలకు మూడు వేల రూపాయలు ఇస్తామని కేజ్రీవాల్ చెప్పారు.
మరోవైపు.. ఢిల్లీలో ఇద్దరు మంత్రులను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేసింది బీజేపీ. ఆ పార్టీ నేతలు ఏకంగా CM అరవింద్ కేజ్రీవాల్ ఇంటి ఎదుట ధర్నా చేశారు. ED కేసులో అరెస్టయిన మంత్రి సత్యేంద్రజైన్, ఎక్సయిజ్ విధానంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో మంత్రి మనీష్ సిసోడియాను మంత్రివర్గం నుంచి తొలగించాలంటూ బీజేపీ డిమాండ్ చేసింది.
ఇలా.. ఢిల్లీలో బీజేపీ.. గుజరాత్లో ఆమ్ఆద్మీ దూకుడు ఆసక్తి రేపుతోంది. రాబోయే గుజరాత్ ఎన్నికల్లో ఎలాగైనా పాగా వేసేందుకు ప్రయత్నిస్తోంది ఆమ్ఆద్మీ. రీసెంట్లీగా జరిగిన పంజాబ్ ఎన్నికల్లో అధికారాన్ని కైవసం చేసుకున్న ఆమ్ఆద్మీ పార్టీ అదే ఉత్సాహంతో గుజరాత్లో దూసుకెళ్తోంది. ప్రధాని సొంత రాష్ట్రంపై పట్టు బిగించేందుకు తగిన ప్రణాళికల్ని రచిస్తోంది. ఇటీవలి కాలంగా గుజరాత్లో వరుస పర్యటనలు జరుపుతున్నారు ఆ పార్టీ అధినేత కేజ్రీవాల్. ఢిల్లీ మాదిరి పాలన అందిస్తామని.. పారదర్శకతకు పెద్దపీట వేస్తామంటూ గుజరాత్ ఓటర్లను ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తున్నారు. అవినీతి రహిత పాలనే తమ ధ్యేయమని ప్రకటిస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..