PM Narendra Modi: యుద్ధం జరుగుతున్న సమయంలో మోడీ యూరప్ పర్యటన.. ఏయే దేశాలంటే..?
PM Modi to visit Europe: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విదేశీ పర్యటనకు సిద్ధమవుతున్నారు. ఈ ఏడాది తొలిసారిగా మే 2 నుంచి 5 వరకు మూడు రోజులపాటు ప్రధాని మోడీ పలు దేశాల్లో
PM Modi to visit Europe: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విదేశీ పర్యటనకు సిద్ధమవుతున్నారు. ఈ ఏడాది తొలిసారిగా మే 2 నుంచి 5 వరకు మూడు రోజులపాటు ప్రధాని మోడీ పలు దేశాల్లో పర్యటించనున్నారు. ప్రధాని ముందుగా ఆయన జర్మనీకి వెళ్లనున్నారు. అక్కడి నుంచి డెన్మార్క్ వెళ్తారు. తిరుగు ప్రయాణంలో మే 4న ప్యారిస్ చేరుకుంటారు. ఈ మేరకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) బుధవారం ప్రకటించింది. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ప్రధాని మోడీ కీలక చర్చలు జరపనున్నారు. బెర్లిన్లో జర్మనీ ఫెడరల్ ఛాన్సలర్ ఒలాఫ్ షోల్స్తో ప్రధాని మోదీ ద్వైపాక్షిక చర్చలు జరుపనున్నట్లు అదికార వర్గాలు తెలిపాయి. ఇండియా జర్మనీ ఇంటర్-గవర్నమెంటల్ కన్సల్టేషన్స్ (IGC) 6వ ఎడిషన్లో ప్రధాని మోదీ, జర్మనీ ఫెడరల్ ఛాన్సలర్ ఒలాఫ్ షోల్స్ పాల్గొని ప్రసంగించనున్నారు. ఈ సమావేశంలో రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం గురించి మూడు దేశాల నేతలతో చర్చించనున్నట్లు సమాచారం.
అనంతరం ప్రధాని మోడీ డెన్మార్క్ ప్రధాని ఆహ్వానం మేరకు కోపెన్హాగన్ వెళ్లనున్నారు. అక్కడ డెన్మార్క్ ప్రభుత్వం ఆతిథ్యమిస్తున్న 2వ ఇండియా-నార్డిక్ సమ్మిట్లో మోడీ పాల్గొననున్నారు. ఈ సదస్సులో ఐస్ల్యాండ్, నార్వే, స్వీడన్, ఫిన్లాండ్ దేశాల ప్రధానమంత్రులతో మోడీ చర్చించనున్నారు. కరోనా అనంతరం ఆర్ధిక పరిస్థితులు, వాతావరణ మార్పులు, నూతన ఆవిష్కరణలు, ఇంధన వనరులు, ప్రపంచ భద్రత, పర్యావరణం తదితర అంశాలపై ఈ భేటీలో చర్చించే అవకాశం ఉంది.
తిరుగు ప్రయాణంలో ప్రధాని మోడీ ప్యారిస్లో ఆగి ఫ్రాన్స్ అధ్యక్షుడిగా ఇటీవల తిరిగి ఎన్నికైన ఇమ్మాన్యుయేల్ మాక్రాన్తో చర్చలు జరపనున్నారు. ఇటీవల జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ఇమ్మాన్యుయేల్ భారీ విజయం సాధించిన నేపథ్యంలో ప్రధాని మోదీ మాక్రాన్ను కలిసి అభినందించనున్నారు. ఉక్రెయిన్ రష్యా యుద్ధం నేపథ్యంలో ప్రధాని మోడీ మూడు రోజుల యూరప్ పర్యటన ఆసక్తికరంగా మారనుంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: