PM Modi: ‘ప్రపంచం దృష్టంతా నా పర్యటనపైనే..’ రష్యా పర్యటనలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు

|

Jul 09, 2024 | 11:49 PM

యుద్దంతో ఏ సమస్యకు పరిష్కారం లభించదన్నారు ప్రధాని మోదీ. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొన్నారు. రష్యా భారత్‌కు ఎప్పటికి మిత్రుడే అని అన్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..

PM Modi: ప్రపంచం దృష్టంతా నా పర్యటనపైనే.. రష్యా పర్యటనలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
Pm Modi & Putin
Follow us on

యుద్దంతో ఏ సమస్యకు పరిష్కారం లభించదు.. భారత్‌ శాంతిని కోరుకుంటోందని రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో నేరుగా చెప్పారు ప్రధాని మోదీ. భారత్‌-రష్యా ద్వైపాక్షిక చర్చల్లో కీలక వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్‌తో రష్యా రెండేళ్ల నుంచి యుద్దం కొనసాగించడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్యకు పరిష్కారం కనుక్కోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. యుద్దం, ఉగ్రదాడుల్లో జనం చనిపోయినప్పుడల్లా తీవ్ర ఆవేదన కలుగుతుందన్నారు మోదీ. అమాయకులు ముఖ్యంగా పిల్లలు యుద్దంలో చనిపోవడం చాలా బాధిస్తోందని పుతిన్‌కు తెలిపారు మోదీ. బాంబులు , తుపాకులతో యుద్దానికి పరిష్కారం లభించదని , చర్చల తోనే పరిష్కారం లభిస్తుందన్నారు. శాంతిని నెలకొల్పడానికి పుతిన్‌కు భారత్‌ అన్నివిధాలా అండగా ఉంటుందని మోదీ తెలిపారు. గత ఐదేళ్లలో కరోనాతో సహా ప్రపంచం ఎన్నో సంక్షోభాలను ఎదుర్కొందన్నారు మోదీ. ఈ సంక్షోభాల ప్రభావం భారత ప్రజలపై పడకుండా చూశామని , దీనిలో రష్యా ప్రభుత్వ సహకారం కూడా ఉందన్నారు మోదీ. పుతిన్‌ తనకు చాలా ఆప్తమిత్రుడన్నారు.

రష్యాలో ప్రధాని మోదీ పర్యటన బిజీబిజీగా కొనసాగింది. మాస్కోలో వార్‌ మెమోరియల్‌ను సందర్శించారు మోదీ. అమర జవాన్లకు ఘననివాళి అర్పించారు. రెండో ప్రపంచయుద్దంలో చనిపోయిన జవాన్ల స్మారక చిహ్నం దగ్గర పుష్ఫగుచ్చం ఉంచారు. గౌరవ వందనం స్వీకరించారు. రోసాటమ్‌ న్యూక్లియర్‌ సెంటర్‌ను సందర్శించారు మోదీ. రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ఆయనకు ఘనస్వాగతం పలింకారు. న్యూక్లియర్‌ పెవిలియన్‌ విశేషాలను మోదీకి వివరించారు. అటు రష్యాలో ప్రధాని నరేంద్ర మోదీకి అత్యున్నత పురస్కారం వరించింది. ‘ది ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్ర్యూ ద అపాసో’ అవార్డుతో రష్యా ఆయనను గౌరవించింది. రష్యా, భారత్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో ఆయన చేసిన కృషికి గానూ ఈ అవార్డును ప్రకటించినట్టు రష్యా తెలిపింది. మోదీ మెడలో పుతిన్ ఆ మెడల్‌ను వేశారు.

అటు తన రష్యా పర్యటనపైనే ప్రపంచం దృష్టి ఉందని, ఈ సమావేశాలపై రకరకాలుగా చర్చించుకుంటున్నారని ప్రధాని మోదీ పేర్కొన్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో భేటి కావడంపై మోదీ హర్షం వ్యక్తం చేశారు. ‘నిన్న మీ ఇంటికి ఆహ్వానించి మంచి స్నేహితుడిలా నన్ను ఆదరించారు. ఉక్రెయిన్ వివాదంపై మనసు విప్పి చర్చించుకున్నందుకు సంతోషంగా ఉంది. ఇద్దరం పరస్పర అభిప్రాయాలను గౌరవించుకున్నాం’ అని పుతిన్‌తో ప్రధాని మోదీ అన్నారు.

అంతకుముందు మాస్కోలో ప్రవాస భారతీయులతో మోదీ సమావేశమయ్యారు. మాతృభూమి నుంచి మీకు శుభాకాంక్షలు తీసుకొచ్చానని అన్నారు. మూడోసారి ప్రధానిగా బాధ్యతలు తీసుకుని నెల గడిచిందని , పేదల కోసం మూడు కోట్ల ఇళ్లు నిర్మిస్తానని హామీ ఇచ్చారు. – భారత అభివృద్ధి చూసి ప్రపంచం నివ్వెరపోతోందన్నారు. పదేళ్లలో ఎయిర్‌పోర్టుల సంఖ్యను రెట్టింపు చేసినట్టు చెప్పారుజ అందుకే భారత్‌ మారుతోందని ప్రపంచం చెబుతోందన్నారు.

ఇది చదవండి: ఆహా.! భలే కూల్ న్యూస్.. ఏపీకి 3 రోజులు భారీ వర్షాలు.. వెదర్ రిపోర్ట్ ఇదిగో

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి