Bomb Attack Meghalaya CM residence: త్రిపుర ముఖ్యమంత్రి బిప్లవ్ దేవ్పై గత వారం హత్యాయత్నం జరిగిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఇప్పటి వరకూ ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు. ఈ ఘటన మరిచిపోకముందే.. మరో రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంటిపై కూడా దాడి జరిగింది. మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ కె సంగ్మా ఇంటిపై గుర్తుతెలియని వ్యక్తులు పెట్రోలు బాంబులతో ఆదివారం రాత్రి దాడి చేశారు. షిల్లాంగ్ నగరంలోని లైమర్ ప్రాంతంలో 3వ మైలు వద్ద ఉన్న సీఎం సంగ్మా వ్యక్తిగత నివాసంపై రెండు పెట్రోల్ బాటిళ్లతో దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. మొదటి పెట్రోల్ బాంబు సీఎం ఇంటి ఎదుట ఆవరణలో పడగా.. రెండో బాంబు ఇంటి వెనుక పెరడులో పడినట్లు పోలీసులు తెలిపారు. అప్రమత్తమైన ముఖ్యమంత్రి సిబ్బంది బాంబు పడి చెలరేగిన మంటలను ఆర్పివేశారు. ఈ దాడి వల్ల ఎలాంటి నష్టం వాటిల్లలేదని పోలీసులు వెల్లడించారు.
నిషేధిత ఉగ్రవాద సంస్థ హెచ్ఎన్ఎల్సీ మాజీ నాయకుడు చెస్టర్ పీల్డ్ తంగ్ కీవ్ మృతి తర్వాత మేఘాలయలో ఆదివారం పరిస్థితి హింసాత్మకంగా మారింది. ఆగస్టు 13న జరిగిన పేలుళ్లకు సంబంధించి.. తంగ్ కీవ్ ఇంటికి వెళ్లిన పోలీసులపై కత్తితో దాడికి యత్నించడంతో అతన్ని కాల్చి వేశారు. పేలుళ్లకు తంగ్ కీవ్ సూత్రధారి అని ఆధారాలున్నాయని మేఘాలయ పోలీసులు తెలిపారు. స్వాతంత్ర్య దినోత్సవం రోజున హింస దృష్ట్యా మేఘాలయ ప్రభుత్వం షిల్లాంగ్ అగ్లోమరేషన్లో కర్ఫ్యూ విధించింది. ఆదివారం నాలుగు జిల్లాల్లో 48 గంటల పాటు ఇంటర్నెట్ సేవలను నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇంకా ఈ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తాజాగా ముఖ్యమంత్రి సంగ్మా ఇంటిపై బాంబు దాడుల నేపథ్యంలో భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఈ దాడికి సంబంధించిన వ్యక్తుల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
Also Read: