400 టర్కిష్ డ్రోన్లతో భారత్పై దాడి! ఆ డ్రోన్లు పాక్కు ఎక్కడివి? అవి ఎలా పని చేస్తాయి.. ఎంత డేంజర్? పూర్తి వివరాలు
భారత సైన్యం శుక్రవారం మీడియా సమావేశంలో పాకిస్తాన్ టర్కీ తయారీ అసిస్గార్డ్ సోంగర్ డ్రోన్లను ఉపయోగించి భారతదేశంపై దాడులు చేసిందని వెల్లడించింది. ఈ డ్రోన్ల శిథిలాలను విశ్లేషిస్తున్నట్లు తెలిపారు. పాకిస్తాన్ పశ్చిమ సరిహద్దులో దాదాపు 300-400 డ్రోన్లతో దాడులు చేయడానికి ప్రయత్నించిందని, అయితే భారత రక్షణ వ్యవస్థలు వాటిని అడ్డుకున్నాయని కల్నల్ సోఫియా ఖురేషి తెలిపారు.

శుక్రవారం జరిగిన ప్రత్యేక మీడియా సమావేశంలో భారత్పై పాకిస్తాన్ టర్కీలో తయారైన అసిస్గార్డ్ సోంగర్ డ్రోన్లను ఉపయోగించిందని భారత ఆర్మీ అధికారులు వెల్లడించారు. గురువారం జరిగిన పరిణామాల గురించి కల్నల్ సోఫియా ఖురేషి మీడియాకు వివరిస్తూ.. “డ్రోన్ల శిథిలాల గురించి ఫోరెన్సిక్ దర్యాప్తు జరుగుతోంది. అవి టర్కిష్ అసిస్గార్డ్ సోంగర్ డ్రోన్లు అని ప్రాథమిక నివేదికలు సూచిస్తున్నాయి” అని అన్నారు. “సైనిక మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకునే ఉద్దేశ్యంతో పాకిస్తాన్ సైన్యం మొత్తం పశ్చిమ సరిహద్దు అంతటా పాక్ డ్రోన్లతో దాడికి దిగింది. 36 ప్రదేశాలలో చొరబాటుకు ప్రయత్నించడానికి దాదాపు 300 నుండి 400 డ్రోన్లను ఉపయోగించారు” అని కల్నల్ అన్నారు.
అసిస్గార్డ్ సోంగర్ డ్రోన్లు అంటే ఏమిటి?
అసిస్గార్డ్ సోంగర్ అనేది టర్కిష్-అభివృద్ధి చేసిన రిమోట్ కంట్రోల్ సాయుధ డ్రోన్ వ్యవస్థ. అంకారాకు చెందిన రక్షణ-పరిశ్రమ సరఫరాదారు అసిస్గార్డ్ ఈ సోంగర్ డ్రోన్లు అభివృద్ధి చేసింది. ఇది క్వాడ్రోటర్ UAEV, గ్రౌండ్-కంట్రోల్ స్టేషన్, గ్రౌండ్-సపోర్ట్ పరికరాల యూనిట్ కలిగి ఉంటుంది. ముఖ్యంగా అసిస్గార్డ్ సోంగర్ డ్రోన్లు లక్ష్యాలను గుర్తించి తొలగించే సామర్థ్యం కలిగి ఉంటాయి. వీటిని రియల్ టైమ్ నిఘా ఉంచడంతో పాటు దాడులను అడ్డుకోవడానికి ఉపయోగించవచ్చు. టర్కిష్ సాయుధ దళాలు 2020 లో మొదటి సోంగర్ డ్రోన్ను పొందాయి. ఆ ఆయుధాన్ని వ్యూహాత్మక 4×4, చక్రాలు కలిగిన, సాయుధ పోరాట వాహనంలో అనుసంధానించారు. తరువాత 2021 లో సోంగర్ను రెండు దేశాలకు ఎగుమతి చేస్తున్నట్లు ప్రకటించారు.
పాకిస్థాన్ వద్దకు ఎలా వచ్చాయి..?
పహల్గామ్ ఉగ్రవాద మారణహోమం తర్వాత భారతదేశం దాడులకు ప్రణాళికలు వేస్తున్న సమయంలో ఏప్రిల్ 27(ఆదివారం)న సైనిక సరుకును మోసుకెళ్తున్న ఆరు టర్కిష్ C-130 హెర్క్యులస్ రవాణా విమానాలు పాకిస్తాన్లో ల్యాండ్ అయ్యాయని ఇటీవల నివేదికలు వెలువడ్డాయి. ఈ డ్రోన్లను పాకిస్తాన్ ఉపయోగించిందని ఇండియా చేసిన వాదనలు.. పాకిస్థాన్కు టర్కీ ఆయుధాలు, మందుగుండు సామగ్రిని అందిస్తోందనే విషయాన్ని బలపరుస్తున్నాయి. పహల్గామ్ ఉగ్రదాడికి కొన్ని రోజుల ముందు పాకిస్తాన్ ప్రధాన మంత్రి షాబాజ్ టర్కీని సందర్శించి ద్వైపాక్షిక సంబంధాలను పెంపొందించుకోవడానికి అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగన్తో సమావేశమయ్యారు. ఇటీవలి కాలంలో ఈ రెండు దేశాలు బలమైన ద్వైపాక్షిక రక్షణ, భద్రతా సహకారాన్ని కలిగి ఉన్నాయి.
టర్కిష్ డ్రోన్లను ధ్వంసం చేసిన భారత్
అయితే, ఈ డ్రోన్లను భారత వైమానిక రక్షణ వ్యవస్థలు విజయవంతంగా అడ్డగించాయి. S-400, ఆకాశ్ వైమానిక రక్షణ వ్యవస్థలు లేదా భారత సాయుధ దళాలతో సేవలో ఉన్న ఏవైనా ఇతర రక్షణ వ్యవస్థలు కావచ్చు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..