Opinion Poll 2023: రాబోయే ఎన్నికల్లో ఆ పార్టీదే అధికారం..! సర్వేలో తేలిన ఆసక్తికర విషయాలు..

అటు పీఎం పదవి అయినా, ఇటు సీఎం పదవి అయినా.. కేంద్రంలోని కాంగ్రెస్, బీజేపీ అవకాశం దొరికిన ప్రతిసారీ కూడా హోరాహోరీగా పోరాడుతుంటాయి. ఇదే క్రమంలో ఈ ఏడాది నవంబర్‌లో జరగబోయే..

Opinion Poll 2023: రాబోయే ఎన్నికల్లో ఆ పార్టీదే అధికారం..! సర్వేలో తేలిన ఆసక్తికర విషయాలు..
Bjp Vs Inc Chhattisgarh Elections 2023

Updated on: Mar 26, 2023 | 9:49 PM

అటు పీఎం పదవి అయినా, ఇటు సీఎం పదవి అయినా.. కేంద్రంలోని కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అవకాశం దొరికిన ప్రతిసారీ కూడా హోరాహోరీగా పోరాడుతుంటాయి. ఇదే క్రమంలో ఈ ఏడాది జరగబోయే ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఈ రెండు పార్టీల మధ్య తీవ్రమైన పోటీ ఉంటుందని ఏబీపీ న్యూస్-మాట్రిజ్ నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా వెల్లడైంది. అయితే ఎన్నికల నాటికి పరిస్థితి మారితే బీజేపీ ప్రభుత్వం ఏర్పాటయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 90 స్థానాలున్న ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే కనీసం 46 మంది ఎమ్మెల్యేలు అవసరం. ఇక గత శాసన సభ ఎన్నికల్లో రాష్ట్ర సీఎం భూపేష్ బఘేల్ నేతృత్వంలోని కాంగ్రెస్‌కు 68 స్థానాలు లభించగా, బీజేపీకి 15 స్థానాలు లభించాయి. ఆపై వచ్చిన ఉపఎన్నికల తర్వాత కాంగ్రెస్‌కు ప్రస్తుతం 71, బీజేపీకి 14 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.

కానీ ఏబీపీ న్యూస్-మాట్రిజ్ ఒపీనియన్ పోల్‌లో లెక్కలను చూస్తే.. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య తేడా కేవలం ఒక శాతం మాత్రమే కనిపిస్తోంది. ఎన్నికల నాటికి బీజేపీ వైపు ప్రజల మొగ్గు పెరిగితే ఆ పార్టీ ప్రభుత్వం ఏర్పాటయ్యే అవకాశం ఉందని ఏబీపీ ఒపీనియన్ పోల్ ద్వారా తెలుస్తోంది. ఈ క్రమంలో కాంగ్రెస్ ఓట్ షేర్ 44 శాతం కాగా, బీజేపీ ఓట్ షేర్ 43 శాతం ఉంది. అలాగే కాంగ్రెస్‌కు 47 నుంచి 52 స్థానాలు లభించవచ్చునని, బీజేపీకి 34 నుంచి 39 స్థానాలు లభించవచ్చని ఈ నివేదిక చెప్తోంది. చివరి క్షణంలో ఓటింగ్ విధానం మారితే బీజేపీకి సానుకూలత పెరిగే అవకాశం ఉందని కూడా ఈ నివేదిక అంచనా వేసింది.

మరోవైపు ప్రతిరాష్ట్రంలో తన పార్టీని విస్తరింపజేయాలని భావిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ, బీఎస్‌పీ పార్టీలు 3 శాతం నుంచి 5 శాతం వరకు ఓట్లను సాధించగలిగినా.. అవి కూడా ఈ ఎన్నికల్లో చెప్పుకోదగ్గ పాత్రను పోషించే అవకాశం ఉందని ఏబీపీ నివేదిక అంచనా వేసింది. మరి ఛత్తీస్‌గఢ్ ప్రజా తీర్పు ఎవరికి అనుకూలంగా ఉండనుందో.. ఎవరికి ప్రతికూల ఫలితాన్ని ఇస్తుందో తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందేనని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us