కవల ఆడపిల్లలు పుట్టారని కన్నకొడుకు, కోడలిపై ఘాతుకం.. అత్తింటివారి అమానుషం!
కవల ఆడపిల్లలు జన్మించారనే నెపంతో కన్న కూతురు వలే చూసుకోవాల్సిన అత్తింటివారే కిరాతకులుగా మారారు. కట్నం వేధింపులకు తోడు ఆడపిల్లలు పుట్టారనే కోపంతో కొడుకు, కోడలిపైనే దాడికి తెగబడిన అమానుష ఘటన ఒడిశాలో వెలుగుచూసింది. ఈ ఘటనకు సంబంధించి ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

కవల ఆడపిల్లలు జన్మించారనే నెపంతో కన్న కూతురు వలే చూసుకోవాల్సిన అత్తింటివారే కిరాతకులుగా మారారు. కట్నం వేధింపులకు తోడు ఆడపిల్లలు పుట్టారనే కోపంతో కొడుకు, కోడలిపైనే దాడికి తెగబడిన అమానుష ఘటన ఒడిశాలో వెలుగుచూసింది. ఈ ఘటనకు సంబంధించి ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఒడిశాలోని మహంగా పోలీస్స్టేషన్ పరిధి పసులుండ గ్రామానికి చెందిన చంద్రశేఖర్ జెనా(23), పార్వతి జెనా(21)లకు ఏడాది క్రితం వివాహమైంది. పెళ్లయిన నాటి నుంచే అదనపు కట్నం తేవాలంటూ అత్త మంజులత, మామ సాముల్య కోడలిని శారీరకంగా, మానసికంగా వేధించడం ప్రారంభించారు. ఈ క్రమంలోనే ఇటీవల పార్వతి కవల ఆడపిల్లలకు జన్మనిచ్చింది. దీంతో అత్తింటివారి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఆడపిల్లలు పుట్టారనే కారణంతో కోడలిపైనే కాకుండా తమ సొంత కొడుకు చంద్రశేఖర్పై కూడా వేధింపులు తీవ్రం చేశారు. పైగా ఆ పసికందులను చంపేస్తామంటూ నిత్యం బెదిరింపులకు గురిచేసేవారు.
ఈ క్రమంలోనే రాయగడ పట్టణంలో మామ సాముల్య, అత్త మంజులత, వారి కుటుంబ సభ్యులు ఒక్కసారిగా దంపతులపై దాడికి దిగి తీవ్రంగా గాయపరిచారు. ఈ దారుణ విషయం తెలుసుకున్న పార్వతి తల్లిదండ్రులు వెంటనే గ్రామానికి చేరుకున్నారు. గాయపడిన కుమార్తె, అల్లుడితో పాటు కవల పిల్లలను సురక్షితంగా తమ వెంట తీసుకెళ్లారు. ప్రస్తుతానికి బాధితురాలు తమ పుట్టిట్లోనే ఆశ్రయం పొందుతున్నారు. ఈ ఘటనపై బాధితులు పోలీసులను ఆశ్రయించారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై చంద్రశేఖర్ బెహరా తెలిపారు. ప్రస్తుతం నిందితులంతా పరారీలో ఉన్నారని, వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశామని పోలీసులు స్పష్టం చేశారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
