Nitish Kumar: కేసీఆర్‌ సభకు నేను రావట్లేదు.. బీఆర్‌ఎస్‌తో బంధంపై బీహార్‌ సీఎం సంచలన వ్యాఖ్యలు..

|

Jan 30, 2023 | 9:25 AM

తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఫిబ్రవరిలో నిర్వహించనున్న కార్యక్రమానికి తాను హాజరు కావడం లేదని బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఆదివారం వెల్లడించారు. సమాధాన్ యాత్రలో భాగంగా ఆదివారం కైమూర్ జిల్లాలో పర్యటించిన సీఎం నితీశ్ కుమార్ విలేకరులతో మాట్లాడారు.

Nitish Kumar: కేసీఆర్‌ సభకు నేను రావట్లేదు.. బీఆర్‌ఎస్‌తో బంధంపై బీహార్‌ సీఎం సంచలన వ్యాఖ్యలు..
Nitish Kumar, Cm Kcr
Follow us on

తెలంగాణ సచివాలయ ప్రారంభోత్సవ కార్యక్రమం ఫిబ్రవరి 17న జరగనుంది. సీఎం కేసీఆర్ పుట్టిన రోజు నాడు నిర్వహించే ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి పలు పార్టీల అధినేతలను, సీఎంలను సీఎం కసీఆర్ ఆహ్వానించారు. అదేరోజు భారీ బహిరంగ సభ కూడా నిర్వహించనున్నారు. దీనిలో భాగంగా బీహార్ సీఎం నితీష్ కుమార్ కు సైతం ఆహ్వానం పంపారు. ఈ క్రమంలో నితీష్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఫిబ్రవరిలో నిర్వహించనున్న కార్యక్రమానికి తాను హాజరు కావడం లేదని బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఆదివారం వెల్లడించారు. సమాధాన్ యాత్రలో భాగంగా ఆదివారం కైమూర్ జిల్లాలో పర్యటించిన సీఎం నితీశ్ కుమార్ విలేకరులతో మాట్లాడారు. హైదరాబాద్‌లో కేసీఆర్‌ సభకు హాజరైనంత మాత్రానా.. కాంగ్రెస్‌తో తమకున్న భాగస్వామ్యానికి వచ్చే నష్టమేమీ లేదంటూ బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ వెల్లడించారు. బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్‌తో కలిసి విపక్షాలను ఏకం చేసేందుకు తాను చేస్తున్న ప్రయత్నాలను ఇంకా విరమించలేదని స్పష్టంచేశారు. భారత్ జోడో యాత్ర ముగింపు అనంతరం ఈ సన్నాహాలను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.

తెలంగాణ సచివాలయ ప్రారంభోత్సవానికి సీఎం కేసీఆర్‌ తనను ఆహ్వానించారని.. అయితే చాలా పనులు ఉండటంతో వెళ్లలేకపోతున్నానని తెలిపారు. దీంతో పార్టీ నుంచి ఎవరినైనా పంపించాలని, ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌కు సైతం ఈ విషయం చెప్పాలని సీఎం కేసీఆర్‌ తనతో ఫోన్ లో కోరారన్నారు. తన బదులు తేజస్వీ యాదవ్‌, జనతాదళ్‌ (యునైటెడ్‌) అధ్యక్షుడు రాజీవ్ రంజన్ సింగ్ (లలన్‌ సింగ్‌) ఆ కార్యక్రమానికి హాజరవుతారని పేర్కొన్నట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ సభకు హాజరైనా కాంగ్రెస్ తో భాగస్వామ్యంపై ఎలాంటి ప్రభావం చూపదన్నారు.

కాగా.. ఇటీవల సీఎం కేసీఆర్ ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహించని విషయం తెలిసిందే. ఈ సభకు ఢిల్లీ, పంజాబ్, కేరళ సీఎంలు, లెఫ్ట్ పార్టీల నాయకులు హాజరయ్యారు. ఈ సభ గురించి నితీష్ ను విలేకరులు ప్రశ్నించగా.. ఈ సభకు తనను ఎవరూ పిలవలేదని, పిలిచినా వచ్చి ఉండేవాడిని కాదంటూ గతంలో పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం..