‘అమ్మా ఓడిపోయాను.. క్షమించు! డబ్బు వృధా అవుతుంది..’ బీటెక్‌ విద్యార్థి సూసైడ్

గ్రేటర్‌ నోయిడాలో ఓ ఇంజినీరింగ్‌ విద్యార్థి హాస్టల్‌లో ఆత్మహత్య చేసుకున్నాడు. తాను ఓడిపోయానని, చదువులో రాణించలేకపోతున్నానని, డబ్బు వృద్ధా అవుతుందంటూ సూసైడ్‌ నోట్‌లో రాసి బలవన్మరణానికి పాల్పడ్డాడు. చనిపోతున్నందుకు తల్లిదండ్రులకు క్షమాపణలు కూడా తెలిపాడు. ఈ విషాద ఘటన ఢిల్లీలోని గ్రేటర్ నోయిడాలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..

అమ్మా ఓడిపోయాను.. క్షమించు! డబ్బు వృధా అవుతుంది.. బీటెక్‌ విద్యార్థి సూసైడ్
BTech Student Dies By Suicide In Noida

Updated on: Dec 25, 2025 | 6:39 PM

బీహార్‌కు చెందిన ఆకాష్ దీప్ అనే విద్యార్ధి ఢిల్లీ టెక్నికల్‌ క్యాంపస్‌లో బీటెక్‌ కంప్యూటర్‌ సైన్స్‌ ఫస్ట్‌ ఇయర్‌ చదువుతున్నాడు. అతడు గ్రేటర్‌ నోయిడాలోని నాలెడ్జ్‌ పార్క్‌ ప్రాంతంలో ఓ ప్రైవేటు హాస్టల్‌లో ఉంటూ చదువుకుంటున్నాడు. అయితే ఏం జరిగిందో తెలియదుగానీ ఆకాష్‌ దీప్ ఉన్నట్లుండి మంగళవారం సాయంత్రం హాస్టల్‌లో తన గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతని రూమ్‌మేట్‌ బయటకు వెళ్లిన సమయంలో తన గదిలోనే ఈ దారుణానికి పాల్పడ్డాడు. బయటకు వెళ్లిన రూమ్ మెట్ తిరిగి వచ్చి చూడగా.. ఆకాష్‌ ఉరి వేసుకుని ఉండటం చూసి గట్టి గట్టిగా అరిచాడు. వెంటనే హాస్టల్‌ సిబ్బంది పరుగున వచ్చి ఆకాశ్‌ను కిందకు దించి ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆకాష్‌ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని హాస్టల్‌లోని ఆకాశ్‌ గదిలోని సూసైడ్‌ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. అందులో..‘ మమ్మీ.. పాపా.. నన్ను క్షమించండి. మీ కొడుకు బలహీనంగా మారిపోయాడు. నేను వేరే ఎవరి వల్లనో ఇలా చేశానని అనుకోకండి. నా మరణానికి నేను మాత్రమే బాధ్యుడిని. దయచేసి నా మరణం గురించి ఎవరినీ ఇబ్బంది పెట్టకండి. నేను డబ్బు ఇంకా వృద్ధా చేయాలని అనుకోవడం లేదు. ఇంటర్‌ 11, 12 తరగతుల్లో ఓడిపోయాను. నా మార్కులు చాలా తక్కువ వచ్చాయి. ఒక ఏడాది కూడా వృద్ధా అయింది. ఇప్పుడు కూడా అదే చేయాలనుకోవడం లేదు. నేను ఓటమిని అంగీకరిస్తున్నా. ఇక ఇది నా వల్ల కాదు. మరో నాలుగు సంవత్సరాలు ఇదే పొడిగించి మీ డబ్బును వృధా చేసి, తప్పుడు ఆశలు కలిగించాలని అనుకోవడం లేదు. అందుకే ఇక్కడితో దీని ముగించడం మంచిదని అనుకుంటున్నాను. ఇంటర్‌లో నా మార్కులు చాలా పూర్‌గా వచ్చాయి. ఇప్పుడు మళ్లీ అదే రిపీట్ చేయాలని అనుకోవడం లేదు. నన్ను క్షమించండి’.. అంటూ అకాశ్‌ తన సూసైడ్‌ లెటర్‌లో తన ఆవేదనను వెల్లడించాడు.

దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు సీనియర్ పోలీసు అధికారి అరవింద్ కుమార్ చాహల్ తెలిపారు. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి డీటీసీ కళాశాలలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నాడని, అతను బీహార్‌కు చెందినవాడని పోలీసుల దర్యాప్తులో తేలింది. చదువుల ఒత్తిడి కారణంగా ఆకాశ్‌ ఆత్మహత్య చేసుకున్నాడని సూచించే సూసైడ్ నోట్ మాకు లభ్యమైంది. పోలీసులు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారని ఆయన తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.