ముంబై మహానగరం.. భారత ఆర్థిక రాజధానిగా అంతర్జాతీయ గుర్తింపు సాధించింది. ఇప్పుడు అత్యంత చెత్త నగరంగా రికార్డును మూటగట్టుకుంది. ప్రపంచంలోనే అత్యంత కలుషిత నగరాల జాబితాలో దేశ రాజధాని ఢిల్లీని వెనక్కినెట్టి రెండో స్థానంలో ఉంది ముంబై. జనవరి 29 నుంచి ఫిబ్రవరి 8 తేదీల మధ్య కాలానికి నమోదైన కాలుష్యం ఆధారంగా ప్రపంచంలోని అత్యంత కలుషిత నగరాల జాబితాను విడుదల చేసింది స్విస్ ఎయిర్ ట్రాకింగ్ ఇండెక్స్ ఐక్యూ ఎయిర్. దీనికోసం సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి సేకరించినట్లు వివరించింది.
గతేడాది నవంబర్, ఈ ఏడాది జనవరి నెలల్లో ముంబైలోని గాలి నాణ్యత ఎక్కువగా ఫూర్, వెరీ పూర్ కేటగిరిలో నమోదు అయినట్లు సెంట్రలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు గణాంకాలు వెల్లడించాయి.వాహనాలు, రోడ్డు, నిర్మాణ కార్యకలాపాల నుంచి నిరంతరం వెలువడే దుమ్ము, పొగ కారణంగా వాతావరణం కలుషితం అయ్యిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. చలికాలం కావడం, నిర్మాణ వ్యర్థాలు ఈ పరిస్థితికి కారణమని వెల్లడించారు. లా నినా ప్రభావం కారణంగా గాలి వేగం నెమ్మదించడం వల్ల కూడా గాలిలో నాణ్యత పడిపోయిందని పేర్కొన్నారు. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ నుంచి సేకరించి ఈ సర్వేను చేపట్టింది ఐక్యూ ఎయిర్.
కాగా ముంబై నగరంలో ఎయిర్ క్వాలిటీ పడిపోవడంతో బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ చర్యలు చేపట్టింది. రానున్న పది రోజులపాటు నగరంలో నిర్మాణ కార్యకలాపాలను నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది. గతకొన్ని రోజులుగా నగరంలో ఎయిర్ క్వాలిటీ తక్కువగా ఉన్న నేపథ్యంలో దుమ్ము స్థాయిని తగ్గించేందుకు తీసుకోవల్సిన మార్గదర్శకాలను కూడా జారీ చేసింది. ముంబైతోపాటు మలాడ్, మజగావ్, చెంబూర్ , అంధేరీ వంటి ప్రాంతాల్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్300 కంటే ఎక్కువగా నమోదైంది. కొలాబా లో 173, భాండూప్ లో 125, బోరివ్లీ లో 111, వర్లీ లో 101గా గాలి నాణ్యత నమోదైంది.
మరిన్ని జాతీయ వార్తలు చదవండి..