Southwest Monsoon: దేశంలోకి నేడు నైరుతి రుతుపవనాల ఎంట్రీ.. ఈ రాష్ట్రాలకు అతి భారీ వర్షాల హెచ్చరిక

Weather Update India: కేరళ, తమిళనాడులోకి నేడు నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని ఐఎమ్‌డీ తెలిపింది. రాబోయే రోజుల్లో కేరళతో పాటు పలు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండగా, అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గి వేడి నుంచి ఉపశమనం లభించే అవకాశముంది.

Southwest Monsoon: దేశంలోకి నేడు నైరుతి రుతుపవనాల ఎంట్రీ.. ఈ రాష్ట్రాలకు అతి భారీ వర్షాల హెచ్చరిక
Monsoon Update

Updated on: Jun 04, 2026 | 11:41 AM

IMD Weather Alert: కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లోకి గురువారంనాడు (జూన్ 4) నైరుతి రుతుపవనాలు (Southwest Monsoon) ప్రవేశించే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది. రాబోయే రోజుల్లో దేశంలోని పలు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితుల్లో గణనీయమైన మార్పులు చోటుచేసుకోనున్నాయని అంచనా వేసింది.

ఐఎమ్‌డీ హెచ్చరికల ప్రకారం పంజాబ్, హర్యానా, ఢిల్లీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కేరళ తదితర రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండి వాతావరణ శాఖ సూచనలను పాటించాలని అధికారులు సూచించారు.

రాబోయే ఐదు నుంచి ఏడు రోజుల పాటు కేరళలోని అనేక ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముంది. కొన్ని ప్రాంతాల్లో 20 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎమ్‌డీ తెలిపింది. దీంతో లోతట్టు ప్రాంతాల్లో నీటి ముంపు పరిస్థితులు ఏర్పడే అవకాశముందని హెచ్చరించింది. నిరంతర వర్షాల ప్రభావంతో ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీల సెల్సియస్ వరకు తగ్గి, ప్రజలకు ఎండల నుంచి ఉపశమనం లభించే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

ఢిల్లీలో కూడా నేడు మండుటెండల తీవ్రత కొంత తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. గరిష్ట ఉష్ణోగ్రత 38 నుంచి 40 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఆకాశం మేఘావృతంగా ఉండటంతో పాటు సాయంత్రం, రాత్రి వేళల్లో తేలికపాటి గాలులు వీచే అవకాశముందని తెలిపింది.

కొత్తగా ఏర్పడిన పశ్చిమ అవాంతరాల ప్రభావంతో ఉత్తర భారత కొండ ప్రాంతాల్లో వాతావరణం ఆహ్లాదకరంగా మారనుంది. హిమాచల్ ప్రదేశ్‌లోని కొన్ని జిల్లాల్లో వడగళ్ల వాన కురిసే అవకాశం ఉండగా, ఉత్తరాఖండ్ ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని ఐఎమ్‌డీ తెలిపింది. పర్యాటకులు వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ తమ ప్రయాణ ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించింది.

ఇదిలా ఉండగా, బీహార్ ప్రజలకు రాబోయే రెండు నుంచి మూడు రోజుల పాటు వేడి నుంచి ఉపశమనం లభించే అవకాశం కనిపించడం లేదు. పలు జిల్లాలకు వడగాలుల హెచ్చరికలు జారీ చేసిన ఐఎమ్‌డీ, జూన్ 10 తర్వాత రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. అలాగే ఉత్తరప్రదేశ్ పశ్చిమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసి ఉష్ణోగ్రతలను తగ్గించే అవకాశముందని పేర్కొంది.

Follow Us