బతుకుదెరువు కోసం వెళ్తే.. బతుకే తెల్లారిపోయింది.. ఘోర ప్రమాదంలో 8మంది కూలీల మృతి
భిండ్, ఆగస్టు 18: మధ్యప్రదేశ్లోని భిండ్ జిల్లాలో జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న ట్రక్కును కూలీలతో ప్రయాణిస్తున్న లోడు వాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోగా, మరో 22 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద తీవ్రతకు వాహనాలు భారీగా ధ్వంసమయ్యాయి.

భిండ్, ఆగస్టు 18: మధ్యప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. భింద్ జిల్లాలో మంగళవారం (ఆగస్టు 18) తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో ఎనిమిది మంది కూలీలు మృతి చెందగా, మరో 32 మంది తీవ్రంగా గాయపడ్డారు. భింద్-గ్వాలియర్ జాతీయ రహదారిపై ఛిమ్కా గ్రామ సమీపంలో అర్ధరాత్రి దాటిన తర్వాత సుమారు ఒంటి గంట సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరీ జిల్లాకు చెందిన పలువురు కూలీలు గ్వాలియర్లో వరి నాట్లు వేసే పనులకు వెళ్లారు. పనులు పూర్తి చేసుకున్న అనంతరం పికప్ వాహనంలో తమ స్వగ్రామానికి తిరుగు ప్రయాణమయ్యారు. ఛిమ్కా గ్రామం సమీపంలోకి చేరుకున్న సమయంలో హైవేపై పశువులు అడ్డుగా రావడంతో వాటిని తప్పించేందుకు డ్రైవర్ ప్రయత్నించినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది.
ఈ క్రమంలో డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోయాడు. పికప్ వాహనం అదుపుతప్పి రహదారిపై రాంగ్ రూట్లోకి వెళ్లడంతో ఎదురుగా వస్తున్న డంపర్ ట్రక్కును బలంగా ఢీకొట్టింది. ఢీకొన్న ధాటికి పికప్ వాహనం పూర్తిగా ధ్వంసమైపోయింది. వాహనంలో ప్రయాణిస్తున్న పలువురు కూలీలు అందులోనే చిక్కుకుపోయారు.
సమాచారం అందుకున్న పోలీసులు, సహాయక బృందాలు వెంటనే ప్రమాద స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. తీవ్రంగా గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. చికిత్స పొందుతున్న వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
ప్రమాదంపై గోహద్ చౌరహా పోలీస్ స్టేషన్ ఇన్చార్జి రామ్నరేష్ యాదవ్ వివరాలు వెల్లడించారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలపై దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. మృతుల కుటుంబాలకు సమాచారం అందించి, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించే ప్రక్రియ చేపట్టారు. ఈ ఘటనతో కూలీల స్వగ్రామాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
