అయ్యో దేవుడా! మరి కొన్ని గంటల్లో ఇంంటి చేరతామనకుంటే.. ఇంతలోనే అనంత లోకాలకు పయనం!

తిరుపతి శ్రీవారి దర్శనం ముగించుకుని బెంగళూరుకు తిరిగి వెళ్తున్న ఓ కుటుంబం కోలార్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదానికి గురైంది. చెన్నై–బెంగళూరు ఎక్స్‌ప్రెస్‌వేపై కారు డివైడర్‌ను ఢీకొని బోల్తా పడటంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో నలుగురు గాయపడ్డారు. డ్రైవర్ నిద్రమత్తు కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు.

అయ్యో దేవుడా! మరి కొన్ని గంటల్లో ఇంంటి చేరతామనకుంటే.. ఇంతలోనే అనంత లోకాలకు పయనం!
Kolar Road Accident

Updated on: Sep 07, 2026 | 4:25 PM

కర్ణాటకలోని కోలార్ జిల్లాలో చెన్నై–బెంగళూరు ఎక్స్‌ప్రెస్‌వేపై సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుపతి శ్రీవారి దర్శనం ముగించుకుని బెంగళూరుకు తిరిగి వెళ్తున్న ఓ కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.

తిరుపతి నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం

తాజా సమాచారం ప్రకారం, బెంగళూరులోని విద్యారణ్యపురానికి చెందిన కుటుంబ సభ్యులు తిరుమల శ్రీవారి దర్శనం కోసం తిరుపతికి వెళ్లారు. దర్శనం పూర్తయిన అనంతరం సోమవారం బెంగళూరు వైపు తిరుగు ప్రయాణమయ్యారు. కోలార్ జిల్లా KGF తాలూకాలోని దొడ్డకరి గ్రామం సమీపంలోకి చేరుకోగానే కారు అదుపుతప్పింది. వేగంగా డివైడర్‌ను ఢీకొనడంతో కారు బోల్తాపడినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదం తీవ్రంగా ఉండటంతో కారులో ఉన్న నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

ఒకే కుటుంబానికి చెందిన నలుగురు!

మృతులను శారదమ్మ (70), దీక్షిత (25), దేవేంద్ర కుమార్ (41), జిష్ణు (13)గా గుర్తించారు. వీరంతా బెంగళూరులోని విద్యారణ్యపురానికి చెందినవారని పోలీసులు గుర్తించారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వికాస్, నీతూ, అద్విక తోపాటు మరో వ్యక్తిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారి పరిస్థితిపై మరిన్ని వైద్య వివరాలు రావాల్సి ఉంది. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అత్యవసర సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం తరలించారు.

ప్రమాదానికి అసలు కారణం!

కారు అదుపుతప్పడానికి ఖచ్చితమైన కారణం ఏమిటన్నది ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది. వాహనం నియంత్రణ కోల్పోయి డివైడర్‌ను ఢీకొన్నట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. డ్రైవర్ నిద్రమత్తులోకి వెళ్లడం వల్ల వాహనం అదుపుతప్పి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ప్రమాదానికి అసలు కారణంపై పూర్తి దర్యాప్తు అనంతరం స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ ఘటనపై బెతమంగళ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులు, వాహనం వేగం, డ్రైవర్ పరిస్థితి తదితర అంశాలపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.

ఎక్స్‌ప్రెస్‌వేపై వరుస ప్రమాదాలపై ఆందోళన

చెన్నై–బెంగళూరు ఎక్స్‌ప్రెస్‌వేపై జరిగిన ఈ ప్రమాదం మరోసారి వాహనదారుల భద్రతపై ఆందోళన కలిగిస్తోంది. వేగంగా ప్రయాణించే వాహనాలు, తెల్లవారుజామున డ్రైవింగ్, నిద్రమత్తు వంటి అంశాలు ప్రమాదాలకు కారణమయ్యే అవకాశం ఉండటంతో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. తిరుపతి దర్శనం ముగించుకుని ఆనందంగా బెంగళూరుకు తిరిగి వస్తున్న కుటుంబాన్ని ఈ ఘోర ప్రమాదం విషాదంలోకి నెట్టింది. నలుగురు కుటుంబ సభ్యులను కోల్పోవడంతో వారి స్వస్థలమైన విద్యారణ్యపురంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులు పూర్తి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us