
కర్ణాటక రాజధాని బెంగళూరులో తీవ్ర కలకలం రేపే ఘటన వెలుగుచూసింది. నగరంలోని బగలగుంటె ప్రాంతంలో ఓ డ్యూప్లెక్స్ ఇంట్లో 52 ఏళ్ల మహిళ అస్థిపంజరం లభ్యమైంది. మృతురాలు దక్షాయణిగా పోలీసులు గుర్తించారు. ఆమె సుమారు ఏడాది క్రితమే మరణించి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఇంట్లో ఒంటరిగా నివసించిన ఆమె మృతదేహం ఇంతకాలం బయటపడకపోవడం స్థానికంగా సంచలనంగా మారింది. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
పోలీసుల వివరాల ప్రకారం.. దక్షాయణి హవనూర్ లేఅవుట్లోని తన డ్యూప్లెక్స్ ఇంట్లో ఒంటరిగా ఉండేది. సుమారు పదేళ్ల క్రితం ఆమె భర్త ఉమేష్ మరణించారు. ఆ తర్వాత ఆమె కుమారుడు కూడా క్యాన్సర్తో మృతి చెందాడు. భర్త, కుమారుడి వరుస మరణాలతో దక్షాయణి తీవ్రంగా కుంగిపోయినట్లు పోలీసులు చెబుతున్నారు. దక్షాయణికి ఒక కుమార్తె కూడా ఉంది. అయితే కుటుంబంలో ఏర్పడిన కొన్ని అభిప్రాయ భేదాల కారణంగా ఆమె, ఆమె భర్త తరచూ దక్షాయణి ఇంటికి వచ్చేవారు కాదని తెలుస్తోంది. అంతేకాకుండా దక్షాయణి తన మొబైల్ నంబర్ను కూడా మార్చుకున్నట్లు కుమార్తె పోలీసులకు తెలిపింది. దీంతో ఆమెతో కుటుంబ సభ్యుల సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. ఈ ఘటనలో కుటుంబ నేపథ్యం, దక్షాయణి చివరిసారిగా ఎప్పుడు కనిపించారు, ఆమె మరణం ఎలా జరిగింది అనే అంశాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ఏడాది తర్వాత బయటపడిన విషాదం
దక్షాయణి సుమారు ఏడాది క్రితమే మరణించి ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఇంట్లో లభించిన అస్థిపంజరాన్ని ఫోరెన్సిక్ నిపుణులు పరిశీలిస్తున్నారు. ఆమె మరణం సహజంగానే జరిగిందా? అనారోగ్యంతో మృతి చెందిందా? లేక మరేదైనా కారణం ఉందా? అనే అంశాలను నిర్ధారించేందుకు పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలం నుంచి కీలకమైన ఫోరెన్సిక్ ఆధారాలను సేకరించారు. అస్థిపంజరానికి సంబంధించిన వైద్య, ఫోరెన్సిక్ పరీక్షల అనంతరం మరణానికి గల కారణం, మరణించిన సమయం వంటి అంశాలపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..