
ఈరోజు కర్నాటక ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి. ఆ రాష్ట్రాన్ని పాలించేది ఎవరో నేడే తెలిసిపోతుంది. ఎవరు గెలుస్తారా అని యావత్ భారతదేశం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఇటీవల ఎగ్జిట్ పోల్స్ కూడా విడుదలయ్యాయి. ఇందులో బీజేపీకి సీట్లు తగ్గి.. కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ వస్తున్నట్లు చూపించాయి. అలాగే మరికొందరు హంగ్ అసెంబ్లీ కూడా వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కర్ణాటక రెవెన్యూ మంత్రి ఆర్. అశోక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి అత్యధిక సీట్లు రాకపోయిన కూడా తాము బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఒకవేళ హంగ్ అసెంబ్లీ వచ్చినా కూడా తమ ప్రభుత్వమే ఏర్పడుతుందని పేర్కొన్నారు. మెజారిటీ సాధించేందుకు మిగతా ఎమ్మెల్యేల కోసం కేంద్రం నుంచి సహాకారం అవసరం అవుతుందని తెలిపారు. తమ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఏం చేస్తామో.. ఎలా చేస్తామో ఇలాంటి విషయాలు అడగొద్దంటూ ఓ టీవి ఛానల్కు తెలిపారు.
అయితే అశోక్ చేసిన వ్యాఖ్యలకు కర్ణాటక బీజేపీ ప్రతినిధి ఎంజీ మహేష్ స్పందించారు. బీజేపీకే అధిక సీట్లు వస్తాయని.. అసలు హంగ్ అసెంబ్లీ వచ్చే అవకాశమే లేదని తెలిపారు. ఎగ్జిట్ పోల్స్తో సంబంధం లేకుండా తమ పార్టీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని విశ్వాసం ఉందని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా కర్ణాటకలో 224 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. 113 సీట్లు సాధించిన పార్టీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం వస్తుంది. మరో ఐదేళ్లు కర్ణాటకను పాలించేది ఎవరో నేడు తెలిసిపోతుంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..