‘బియ్యం లేవ్‌.. డబ్బు లిస్తాం’ బియ్యానికి బదులు కార్డుదారుల ఖాతాల్లో డబ్బు జమచేస్తోన్న సర్కార్

|

Jun 29, 2023 | 9:32 AM

ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేక కర్ణాటక ప్రభుత్వం ఇబ్బందులు పడుతోంది. అధికారం చేపట్టిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రతి నెలా పేదలకు ఉచితంగా ఇస్తామన్న 5 కిలోల బియ్యం అందించలేక చేతులెత్తేసింది.  దీంతో 'అన్న భాగ్య' పథకం కింద..

బియ్యం లేవ్‌.. డబ్బు లిస్తాం బియ్యానికి బదులు కార్డుదారుల ఖాతాల్లో డబ్బు జమచేస్తోన్న సర్కార్
Anna Bhagya Scheme
Follow us on

బెంగళూరు: ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేక కర్ణాటక ప్రభుత్వం ఇబ్బందులు పడుతోంది. అధికారం చేపట్టిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రతి నెలా పేదలకు ఉచితంగా ఇస్తామన్న 5 కిలోల బియ్యం అందించలేక చేతులెత్తేసింది.  దీంతో ‘అన్న భాగ్య’ పథకం కింద అదనంగా ఇచ్చే 5 కిలోల బియ్యానికి బదులు కిలోకు రూ.34 చొప్పున నగదు లబ్ధిదారుల ఖాతాలో జమ చెయ్యాలని సిద్ధరామయ్య ప్రభుత్వం నిర్ణయించింది.

కాగా కేంద్రం ఉచితంగా ఇచ్చే ఐదు కిలోల బియ్యంతో పాటు అదనంగా కుటుంబంలో ఒక్కొక్కరికీ నెలకు మరో ఐదు కిలోల బియ్యం ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ హామీ ఇచ్చింది. జులై 1 నుంచి ఈ అన్నభాగ్య పథకాన్ని ప్రారంభించాల్సి ఉంది. ఐతే అనుకున్న సమయానికి బియ్యం సరఫరా కానందున బియ్యానికి బదులు నగదు పంపిణీ చేస్తామని ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. జులై 1వ తేదీన కిలోకు రూ. 34 చొప్పున డబ్బును బీపీఎల్‌ రేషన్ కార్డ్ హోల్డర్‌ల ఖాతాలో నేరుగా జమచేయనున్నారు. దీని ప్రకారం ఒక కార్డులో ఒకరు ఉంటే అన్న భాగ్య పథకం కింద ఐదు కిలోల అదనపు బియ్యానికి బదులు నెలకు రూ.170 ప్రభుత్వం జమ చేస్తుంది. ఇద్దరు వ్యక్తులకు రూ.340, ఐదుగురు వ్యక్తులకు రూ.850ల చొప్పున జమకానున్నాయి. బియ్యం అందే వరకు 5 కిలోలకు డబ్బులు ఇస్తామని, ఇందుకు ప్రతినెలా రూ.700 కోట్లు ఖర్చు అవుతుందని వెల్లడించింది.

కిలో బియ్యానికి 34 రూపాయల చొప్పున కొనుగోలు చేయడానికి ప్రయత్నించాం. కానీ ఆ ధరకు బియ్యాన్ని సరఫరా చేయడానికి ఏ సంస్థ ముందుకు రాలేదని కర్ణాటక ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్  మంత్రి కేహెచ్ మునియప్ప బుధవారం ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో తెలిపారు. కర్ణాటకలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత బుధవారం జరిగిన తొలి కేబినెట్ సమావేశంలోనే ఈ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.