Kamal Hasan joins Owaisi in criticizing Modi: ఏప్రిల్ 5వ తేదీన రాత్రి 9 గంటలకు 9 నిమిషాల పాటు లైట్లు ఆర్పేసి… 9 నిమిషాల పాటు దీపాలు వెలిగించడం ద్వారా కరోనా వైరస్ నియంత్రణా పోరాటానికి సంఘీభావం ప్రకటించాలని కోరిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని విమర్శించేందుకు పోటీ పడుతున్న వారిలో ప్రముఖ నటుడు, మక్కల్ నీతి మయ్యం పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ చేరారు. నియంత్రణ చర్యలపై ఫోకస్ చేయకుండా దీపాల పేరిట టైమ్ పాస్ చేయడమేంటంటూ మోదీని నిలదీసిన.. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీతో జతకట్టారు కమల్ హాసన్.
ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగంఫై ఘాటుగా స్పందించారు కమల హాసన్. దేశ ప్రధాని మాట్లాడుతున్నారని, ప్రస్తుత విపత్కర పరిస్థితులపై దిశా నిర్దేశాలను సూచిస్తారని తాను భావించానని, కానీ అందుకు భిన్నంగా మోదీ ప్రసంగించారని కమల్ హాసన్ అంటున్నారు. ప్రస్తుత పరిస్థితులలో వైద్య సిబ్బందికి కావలసిన కనీస వసతులు, సాధారణ ప్రజలకు నిత్యావసర సరుకులు అందుబాటులో ఉంచడంపై చర్యలు తీసుకోవాల్సి వుందని ఆయన చెబుతున్నారు. పేదలకు జీవనాధారం, ఆర్థిక మాధ్యమాన్ని మెరుగుపరచడం లాంటి అంశాలను మోదీ ప్రస్తావించకపోవడం విచారకరమని కమల్ హాసన్ అన్నారు.
పోరాట పటిమకు తాము ఎప్పుడో మొదలుపెట్టిన టార్చ్ లైట్ పోరాటాన్ని ఇప్పుడు ప్రధాని మొదలు పెట్టారా …? అని కమల్ హాసన్ ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి మోదీ తీసుకున్న నిర్ణయం తమకు నిరాశనే మిగిల్చిందని ఆయన వ్యాఖ్యానించారు.