Emergency Mock Drill: సైరన్ మోగుతుంది.. బీ అలర్ట్.. మాక్‌డ్రిల్స్‌లో ముఖ్యమైన అంశాలు ఇవే..

భారత్‌-పాక్ మధ్య యుద్ధమేఘాలు కమ్ముకుంటున్న వేళ భారత్‌ చేపడుతున్న చర్యలతో పాక్‌ వణికిపోతోంది. ఏ క్షణమైన తమపైన భారత్‌ దాడి చేస్తుందని తీవ్రంగా భయపడుతోంది. అంతర్జాతీయంగా ఏకాకిగా మారడంతో ఎటూ పాలుపోని స్థితిలో పాక్‌ ఉంది. భారత్‌ను ఎదుర్కోలేమని తెలిసినా సరిహద్దులకు భారీగా సైన్యాన్ని తరలిస్తోంది. అటు చినాబ్‌ జల ప్రవాహాన్ని భారత్‌ ఆపేయడంతో పాక్‌లో జలాలు అడుగంటాయి.

Emergency Mock Drill: సైరన్ మోగుతుంది.. బీ అలర్ట్.. మాక్‌డ్రిల్స్‌లో ముఖ్యమైన అంశాలు ఇవే..
Emergency Mock Drill

Updated on: May 06, 2025 | 8:32 PM

భారత్‌-పాక్ మధ్య యుద్ధమేఘాలు కమ్ముకుంటున్న వేళ భారత్‌ చేపడుతున్న చర్యలతో పాక్‌ వణికిపోతోంది. ఏ క్షణమైన తమపైన భారత్‌ దాడి చేస్తుందని తీవ్రంగా భయపడుతోంది. అంతర్జాతీయంగా ఏకాకిగా మారడంతో ఎటూ పాలుపోని స్థితిలో పాక్‌ ఉంది. భారత్‌ను ఎదుర్కోలేమని తెలిసినా సరిహద్దులకు భారీగా సైన్యాన్ని తరలిస్తోంది. అటు చినాబ్‌ జల ప్రవాహాన్ని భారత్‌ ఆపేయడంతో పాక్‌లో జలాలు అడుగంటాయి. అక్కడ సాగు చేస్తున్న వరి, పత్తి పంటలకు తీవ్ర నష్టం సంభవిస్తోంది. అటు యుద్ధ సన్నద్ధతలో భాగంగా భారత్‌లో రేపు దేశవ్యాప్తంగా మాక్‌డ్రిల్స్‌ నిర్వహించనున్నారు. యుద్ధ సన్నద్ధతను పరిశీలించేందుకు ఈ మాక్‌ డ్రిల్స్‌ ఉపయోగపడతాయి. 1971 తర్వాత ఇలాంటి మాక్‌డ్రిల్‌ నిర్వహించడం దేశంలో ఇదే మొదటిసారి.

రేపు దేశవ్యాప్తంగా నిర్వహించే మాక్‌డ్రిల్స్‌లో ఆరు కీలక అంశాలు ఉంటాయి.

ఇందులో మొదటిది యుద్ధ సైరన్లు మోగించడం, కమ్యూనికేషన్‌ నెట్‌వర్క్స్‌ సన్నద్ధతను పరిశీలిస్తారు.

రెండోది కంట్రోల్‌ రూమ్స్‌ సన్నద్ధత. మాక్‌డ్రిల్‌లో భాగంగా కంట్రోల్‌ రూమ్స్‌ ఎలా పనిచేస్తున్నాయి, వాటి సామర్ధ్యాన్నీ అంచనా వేస్తారు.

మూడోది పౌరులు, విద్యార్థులకు శిక్షణ. తమను తాము ఎలా రక్షించుకోవాలనే దానిపై శిక్షణ ఇస్తారు. సురక్షిత ప్రాంతాలకు ఎలా వెళ్లాలి, సైరన్లు మోగినప్పుడు ఎలా స్పందించాలి.

నాలుగోది వైమానిక దాడి లేదా సాధారణ దాడి జరిగినప్పుడు జనాలు ఎలా ఖాళీ చేయించాలనేది ఉంటుంది. దాడి సమయంలో శత్రు విమానాలు గుర్తించకుండా ఉండేందుకు బ్లాక్‌ ఔట్‌ చర్యలు ఉంటాయి.

ఐదో చర్యగా కీలక మౌలిక సదుపాయాలను కవర్ చేయడం ఉంటుంది. ముఖ్యంగా విద్యుత్‌ కేంద్రాలు, కమ్యూనికేషన్ టవర్లు, ఇంధన డిపోలు వంటి వాటిని కప్పేస్తారు. దీని కోసం నెట్స్‌, కవర్లు, ఆకుల వంటివి ఉపయోగిస్తారు.

ఆరో చర్యగా అధిక రిస్క్‌ ఉండే ప్రాంతాల్లో ప్రజలను ఖాళీ చేయించే ప్రక్రియ ఉంటుంది. దీనికనుగుణంగా బంకర్ల వంటివి శుభ్రం చేసి సిద్ధంగా ఉంచారు.

వెలుతూరు లేకుండా.. బ్లాక్ ఔట్..

మాక్‌ డ్రిల్‌లో భాగంగా రేపు దేశవ్యాప్తంగా కీలక ప్రాంతాల్లో బ్లాక్‌ఔట్‌ చేస్తారు. యుద్ధం భయం ఉన్నప్పుడు ముఖ్యంగా వాయుమార్గాల్లో యుద్ధం జరిగే ముప్పు ఉన్నప్పుడు శత్రువు దృష్టి భూమిపై ఉండే వెలుతురుపై ఉంటుంది. నగరాల్లోని వెలుగుజిలుగులు, వాహనాల హెడ్‌లైట్లు, ఇళ్లలో వెలుతురు టార్గెట్లుగా మారుతాయి. ఈ ప్రమాదాన్ని నివారించేందుకు బ్లాక్‌ఔట్‌ చేస్తారు. బ్లాక్‌ఔట్‌ ఆదేశాలు జారీచేసినప్పుడు ఇళ్లలో లైట్లన్నీ ఆర్పేయాలి, కిటీకీలపై నల్లటి పరదాలు వేయాలి, వాహనాల హెడ్‌లైట్స్‌పై నల్లటి కవర్‌ వేయాలి, వీధి దీపాలు కూడా కొంత సమయం వరకు ఆర్పేస్తారు.

యుద్ధమంటూ సంభవిస్తే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌ సన్నద్ధమవుతోంది. ముందు జాగ్రత్త చర్యగా బెంగాల్‌ జల్పాయిగురి ప్రాంతంలో IAF -చీటా హెలికాప్టర్‌ను దింపింది. ఎమర్జెన్సీ ల్యాండింగ్‌కు ఉన్న అవకాశాలను ఎయిర్‌ఫోర్స్‌ సిబ్బంది పూర్తిగా పరిశీలించారు. అటు ఎయిర్‌ఫోర్స్‌ పోలీస్ కూడా రంగంలోకి దిగింది.

రేపటి మాక్‌ డ్రిల్స్‌లో భాగంగా దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో రీహార్సాల్స్‌ నిర్వహించారు. వైమానిక దాడుల సమయంలో హెచ్చరిక వ్యవస్థల పనితీరును పరిశీలించడం మాక్‌ డ్రిల్స్‌ ప్రధాన ఉద్దేశం. ఇందులో ఎయిర్‌ఫోర్స్‌-మిలటరీ మధ్య సమన్వయం ఉంటుంది. వివిధ యంత్రాంగాల స్థాయిలో దేశవ్యాప్తంగా అందరి ప్రమేయం ఇందులో ఉంది. ఎమర్జెన్సీ సిబ్బందికే కాకుండా సాధారణ ప్రజలకు కూడా శిక్షణ ఉంటుంది.

హైదరాబాద్ లోని.. సికింద్రాబాద్‌, గోల్కొండ, కంచన్‌బాగ్‌ DRDA, మౌలాలిలోని NFCలో డిఫెన్స్‌ బృందాలు మాక్‌డ్రిల్‌ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు మాక్ డ్రిల్ ప్రారంభమవుతుంది.

1971 తర్వాత దేశంలో ఇలాంటి మాక్‌ డ్రిల్స్‌ నిర్వహించడం ఇదే మొదటిసారి. 33 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 250 చోట్ల ఈ మాక్‌ డ్రిల్స్ చేపడతారు. యూపీలోని అన్ని జిల్లాల్లో రేపు మాక్‌డ్రిల్స్‌ నిర్వహిస్తారు. మహారాష్ట్రలో తీర ప్రాంతాల్లో, మధ్యప్రదేశ్‌లో ఐదు నగరాల్లో మాక్‌డ్రిల్స్‌ ఉంటాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..