
Agnipath Protest – Special Train: అగ్నిపథ్ ఆందోళనల నేపథ్యంలో కాశీలో చిక్కుకుపోయిన యాత్రికుల సౌకర్యార్థం భారత రైల్వే శాఖ(Indian Railways) ఓ ప్రత్యేక రైలును నడపనుంది. బనారస్ (Banaras) రైల్వే స్టేషన్ నుంచి చెన్నై సెంట్రల్ (Chennai Central)కు ఈ ప్రత్యేక రైలును నడపనున్నారు. తెలుగు రాష్ట్రాల మీదుగా చెన్నై సెంట్రల్కు చేరుకోనుంది. దీంతో కాశీలో చిక్కుకున్న తెలుగు యాత్రికులు ఆ ప్రత్యేక రైలు ద్వారా తమ స్వస్థలాలకు చేరుకునే సౌలభ్యం లభించనుంది. ప్రత్యేక రైలు (నెం.05120) ఇవాళ (20.06.2022) రాత్రి 08 గం.లకు బయలుదేరి బుధవారం ఉదయం 08.10 గం.లకు చెన్నై సెంట్రల్కు చేరుకుంటుంది. ఈ ప్రత్యేక రైలు జ్ఞాన్పూర్ రోడ్, ప్రయాగ్రాజ్ జంక్షన్, సాత్నా, కత్ని, జబల్పూర్, ఇటార్సి, నాగ్పూర్, సేవాగ్రమ్, చంద్రాపూర్, బల్హర్షా, సిర్పూర్ కాగజ్నగర్, రామగుండం, వరంగల్, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు రైల్వే స్టేషన్లలో ఆగనుంది.
త్రివిధ దళాల్లో నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం అగ్నిపథ్ యోజన పథకాన్ని ప్రకటించింది. దీనిపై దేశంలోని పలు ప్రాంతాల్లో నిరసనలు వెల్లువెత్తాయి. ఆందోళనకారులు రైల్వే స్టేషన్లు, రైళ్లపై దాడులు చేయడంతో పాటు రైళ్ల రాకపోకలను అడ్డుకున్నారు. దీంతో భారత రైల్వే శాఖ వందలాది రైళ్లను రద్దు చేసింది. దీంతో ఏపీ, తెలంగాణతో పాటు తమిళనాడుకు చెందిన యాత్రికులు వారణాసిలో చిక్కుకపోయారు. సొంత స్థలాలకు ఎలా వెళ్లాలో తెలియక దిక్కుతోచని స్థితిలో యాత్రికులు ఉన్నారు.
యూపీ అధికారులతో మాట్లాడిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..
కాశీలో చిక్కుకపోయిన తెలుగు యాత్రికుల సంగతి తెలుసుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..వారణాసి జిల్లా కలెక్టర్తో మాట్లాడి తెలుగు యాత్రికులను సురక్షితంగా వారి స్వస్థలాలకు పంపేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. అక్కడ వారికి అవసరమైన వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ నేపథ్యంలో వారణాసిలో చిక్కుకున్న యాత్రికులు తమ స్వస్థలాలకు చేరుకునేందుకు రైల్వే శాఖ ప్రత్యేక రైలును నడుపుతోంది.
Banaras to Chennai Central Special Train details
మరిన్ని జాతీయ వార్తలు చదవండి..