
వర్జీనియా, మే 27: అమెరికాలో మరో భారతీయ మహిళ హత్యకు గురైన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. గుజరాత్ రాష్ట్రానికి చెందిన 45 ఏళ్ల మేఘనా పటేల్ను అమెరికాలోని వర్జీనియాలో ముసుగు ధరించిన ఓ అగంతకుడు కాల్చిచంపాడు. ఈ దారుణ ఘటన మే 23 చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
మేఘనా పటేల్ గత 10 సంవత్సరాలుగా వర్జీనియాలోని ఒక సూపర్ మార్కెట్లో పనిచేస్తోంది. ఘటన జరిగిన రోజు ఓ వ్యక్తి కస్టమర్ వేషంలో స్టోర్లోకి ప్రవేశించాడు. అతడు హుడీ జాకెట్, మాస్క్, గ్లోవ్స్, క్యామఫ్లేజ్ తరహా ప్యాంట్ ధరించి ఉన్నాడు. సీసీటీవీ ఫుటేజ్లో కనిపించిన దృశ్యాల ప్రకారం.. దుండగుడు కౌంటర్ వద్ద ఉన్న మేఘనా పటేల్తో కాసేపు మాట్లాడిన తర్వాత ఒక్కసారిగా తుపాకీ బయటకు తీసి అత్యంత సమీపం నుంచి వరుసగా రెండు సార్లు కాల్పులు జరిపాడు. బుల్లెట్లు తగలడంతో మేఘనా కౌంటర్ వెనుక కుప్పకూలింది. అనంతరం దుండగుడు కౌంటర్పైకి ఎగబాకి మరోసారి కాల్పులు జరిపి అక్కడి నుంచి పరారయ్యాడు.
🇺🇸 #Virginia, USA — A 45-year-old Indian woman from Gujarat was shot dead inside a supermarket during a suspected robbery attempt. pic.twitter.com/2YIIUtPeVL
— World Wide Leak (@leaklive1) May 26, 2026
సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపినట్లు సమాచారం. హత్యకు గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది. మేఘనా పటేల్ స్వస్థలం గుజరాత్ రాష్ట్రంలోని మెహసానా జిల్లా, విశ్నగర్ తాలూకాలోని జన్ట్రాల్ గ్రామం. ఆమె తల్లిదండ్రులు ప్రస్తుతం గుజరాత్లో ఉండగా, భర్త ఉపేంద్రభాయ్ పటేల్, కుమార్తె నక్షిబెన్, కుమారుడు స్మిత్ అమెరికాలో నివసిస్తున్నారు. ఈ ఏడాది అమెరికాలో హత్యకు గురైన గుజరాత్కు చెందిన నాలుగో వ్యక్తిగా మేఘనా పటేల్ నిలిచింది. ఈ ఘటనతో అమెరికాలోని గుజరాతీయుల భద్రతపై ఆందోళన నెలకొంది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.