గుజరాత్ (Gujarat) అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ కు వరస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ రాజీనామా నుంచి ఇంకా కోలుకోలేని హస్తం పార్టీకి మరో ఊహించని షాక్ తగిలింది. గుజరాత్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు విశ్వనాథ్సింగ్ వాఘేలా తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు కాంగ్రెస్ అధిష్టానానికి లేఖ పంపారు. అందులో పార్టీ నాయకులను ఉద్దేశించి ఘాటు ఆరోపణలు చేశారు. తనకు గుజరాత్ యూత్ కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఇచ్చేందుకు కోటిన్నర రూపాయలు తీసుకున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ (Congress) పార్టీలో ఏ పదవి కావాలన్నా డబ్బులు సమర్పించుకోవాల్సిందేనని, పార్టీలో అంతర్గత పోరు కారణంగా కార్యకర్తలకు తీరని అన్యాయం జరుగుతోందన్నారు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే తాను ఏపార్టీలో చేరబోయేది ఇంకా స్పష్టం చేయలేదు. సరిగ్గా రాహుల్ గాంధీ గుజరాత్ పర్యటనకు ఒక రోజు ముందు విశ్వనాథ్ సింగ్ వాఘేలా పార్టీకి రాజీనామా చేయడం కాంగ్రెస్ శ్రేణులను విస్మయానికి గురి చేసింది. ఆయన కామెంట్స్ అంతకన్నా తీవ్రమైన ఎక్కువ షాకింగ్ ఇచ్చాయి.
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ఇవాళ గుజరాత్ వస్తున్నారు. అహ్మదాబాద్లోని సబర్మతి రివర్ఫ్రంట్లో బూత్ స్థాయి కార్యకర్తల ‘పరివర్తన్ సంకల్ప్’ సదస్సులో పాల్గొని ప్రసంగిస్తారు. మరోవైపు రాహుల్ పర్యటనపై బీజేపీ నాయకులు సెటైర్స్ వేస్తున్నారు. కాంగ్రెస్లో చేరమంటూ ప్రచారం చేసేందుకు రాహుల్ గుజరాత్ వస్తుంటే, ఆ పార్టీలో క్విట్ కాంగ్రెస్ జరుగుతోందని వారన్నారు. గుజరాత్లో ఈ ఏడాది చివర అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. బీజేపీని ఎలాగైనా అధికారం నుంచి దించాలనే లక్ష్యంతో ఓవైపు కాంగ్రెస్, మరోవైపు ఆప్ గుజరాత్ మీద ఫోకస్ పెట్టాయి.
కాగా.. కాంగ్రెస్ అగ్ర నేతల్లో ఒకరైన గులాం నబీ ఆజాద్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీలోని అన్ని పదవులకు రాజీనామా చేశారు. పార్టీ విధానాలు, అంతర్గత వ్యవహారాల గురించి పలుసార్లు బహిరంగంగానే విమర్శలు గుప్పించిన ఆజాద్.. తాజాగా రాహుల్ గాంధీ తీరును కూడా తప్పుబట్టారు. రాహుల్ వైస్ ప్రెసిడెంట్ అయ్యాక పార్టీ నాశనమైందని పేర్కొన్నారు. సీనియర్లందరినీ రాహుల్ పక్కన పెట్టారంటూ ఆవేదన వ్యక్తంచేశారు. రాహుల్ గాంధీది చిన్న పిల్లల మనస్తత్వం అని, ఈ పరిస్థితికి రాహుల్ కారణమని పేర్కొన్నారు. తాను రాజీనామా ఎందుకు చేయాల్సి వచ్చిందో వివరిస్తూ.. కాంగ్రెస్ సీనియర్ నేత ఆజాద్ మొత్తం ఐదు పేజీల లేఖను సోనియాకు పంపించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..