Amarnath Yatra: అమర్ నాథ్ యాత్రే టార్గెట్‌గా పాక్ కుట్రలు.. డ్రోన్ల ద్వారా పేలుడు పదార్థాలు.. సరిహద్దుల్లో అలర్ట్..

|

Jun 08, 2022 | 7:44 AM

డ్రోన్ల ద్వారా దేశంలోకి అక్రమంగా పేలుడు పదార్థాలను సరఫరా చేసేందుకు టెర్రరిస్టులు చేస్తున్న ప్రయత్నాలను జమ్ముకశ్మీర్‌ పోలీసులు భగ్నం చేశారు.

Amarnath Yatra: అమర్ నాథ్ యాత్రే టార్గెట్‌గా పాక్ కుట్రలు.. డ్రోన్ల ద్వారా పేలుడు పదార్థాలు.. సరిహద్దుల్లో అలర్ట్..
Indian Army
Follow us on

Pakistan Drones: అమర్‌నాథ్‌ యాత్రే లక్ష్యంగా విధ్వంసం సృష్టించాలని పాక్‌ గత కొంతకాలంగా చేస్తోన్న కుట్రలను పోలీసులు, భద్రతా బలగాలు ఎప్పటికప్పుడు భగ్నం చేస్తున్నారు. తాజాగా జమ్ముకశ్మీర్‌లో పాకిస్తాన్‌ కుట్రలు కొనసాగుతున్నాయి. డ్రోన్ల ద్వారా దేశంలోకి అక్రమంగా పేలుడు పదార్థాలను సరఫరా చేసేందుకు టెర్రరిస్టులు చేస్తున్న ప్రయత్నాలను జమ్ముకశ్మీర్‌ పోలీసులు భగ్నం చేశారు. డ్రోన్‌ నుంచి జారవిడిచిన మూడు మ్యాగ్నెటిక్‌ ఐఈడీ బాంబులను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అమర్‌నాథ్‌ యాత్రికులను టార్గెట్‌ చేసేందుకు ఉగ్రవాదులు డ్రోన్లతో స్టిక్కీ బాంబులను ప్రయోగిస్తునట్టు తాజా దర్యాప్తులో వెల్లడయ్యింది. అయితే గత నెలాఖర్లోనూ కథువాలోని తాల్లీ హరియాచాక్‌ గ్రామం వద్ద ఓ క్వాడ్‌కాప్టర్‌ను జమ్మూకశ్మీర్‌ పోలీసులు కూల్చివేశారు. అందులో కూడా ఏడు మ్యాగ్నెటిక్‌ బాంబులు, ఏడు యూజీబీఎల్‌ గ్రనేడ్లను స్వాధీనం చేసుకున్నారు.

అఖ్నూర్‌ సెక్టార్‌లోని భారత్‌ – పాకిస్థాన్‌ సరిహద్దు ప్రాంతంలో పాక్‌ డ్రోన్ సంచరిస్తున్నట్లు గుర్తించారు బీఎస్‌ఎఫ్‌ జవాన్లు. ఆ తర్వాత పోలీసు పార్టీ అక్కడ మోహరించి యాంటీ డ్రోన్‌ వ్యవస్థను రంగంలోకి దించారు. కనచక్‌లో మరోసారి మరోసారి పాక్‌ డ్రోన్‌ కన్పించింది. వెంటనే భద్రతా సిబ్బంది కాల్పులు జరిపారు. డ్రోన్‌ నుంచి జారిపడిన పేలోడ్‌లో టిఫిన్‌ బాక్సుల్లో ఉన్న మూడు మ్యాగ్నెటిక్‌ ఐఈడీలను పోలీసులు గుర్తించారు. వాటికి టైమర్‌ కూడా సెట్‌ చేసి ఉంచినట్లు తెలిపారు. పోలీసులు వెంటనే బాంబులను నిర్వీర్యం చేశారు.

కాగా.. జమ్మూకశ్మీర్ లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది. గత 24 గంటల్లో జమ్మూ కశ్మీర్‌లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారని అధికారులు తెలిపారు. మరణించిన వారిలో ముగ్గురు పాకిస్థానీలు కాగా, నాల్గవ వ్యక్తిని గుర్తించే పనిలో ఉన్నట్లు స్థానిక పోలీసులు తెలిపారు. సైన్యం, కేంద్ర సాయుధ పోలీసు బలగాలు, జమ్మూ కశ్మీర్ పోలీసులు ఏకకాలంలో ఆపరేషన్లు నిర్వహించి నలుగురు ఉగ్రవాదులను హతమార్చారు.

ఇవి కూడా చదవండి

AK-56, గ్రెనేడ్లు, మందుగుండు సామాగ్రితో సహా భారీ ఆయుధాలు కూడా వారి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పాకిస్తాన్‌ కుట్రకు వ్యతిరేకంగా బీజేపీ అఖ్నూర్‌లో ఆందోళనలు చేపట్టింది. ఉగ్రవాదులకు వ్యతిరేకంగా కార్యకర్తలు నినాదాలు చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..