
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉన్నావ్ రేప్ కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. నిందితుడు కుల్దీప్ సెంగార్ శిక్షపై స్టే విధిస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు ఆపేసింది. కుల్దీప్ సెంగార్ను విడుదల చేయరాదని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీ హైకోర్టు తీర్పుపై సీబీఐతో పాటు బాధితురాలు పిటిషన్లను విచారించిన సుప్రీంకోర్టు ఈ కీలక ఆదేశాలను జారీ చేసింది.
సుప్రీంకోర్టు తీర్పుపై బాధితురాలి కుటుంబం హర్షం వ్యక్తం చేసింది. అయితే తమకు పాక్షిక విజయం మాత్రమే అని , కుల్దీప్సింగ్ సెంగార్కు ఉరిశిక్ష విధించినప్పుడే తమకు న్యాయం జరుగుతుందన్నారు. కుల్దీప్ సెంగార్కు ఉరిశిక్ష విధించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. న్యాయవ్యవస్థపై తమకు నమ్మకం ఉందన్నారు. సీబీఐ పిటిషన్పై జవాబు ఇవ్వాలని కుల్దీప్ సెంగార్కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.
తన భర్తను చంపేస్తామని బెదిరింపులు వస్తున్నాయని ఆరోపించారు బాధితురాలు. ఫేక్ వీడియోలతో కుల్దీప్ అనుచరులు వేధిస్తున్నారని అన్నారు. తన కుటుంబం, భర్త ఫోటోలను ఫేస్బుక్ నుంచి తీసి ఏఐ వీడియోలు చేసి ప్రచారం చేస్తున్నారని పేర్కొంది.. తన భర్త ఉద్యోగం చేయకుండా అడ్డుకుంటున్నారని బాధితురాలు ఆవేదన వ్యక్తంచేశారు.
2017లో కుల్దీప్ సింగ్ యూపీ లోనపి ఉన్నావ్ ప్రాంతానికి చెందిన ఓ మైనర్ బాలికను కిడ్నాప్ చేసి, అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆగస్టు 1, 2019న సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అత్యాచారం కేసు, సంబంధిత ఇతర కేసులను ఉత్తరప్రదేశ్లోని ట్రయల్ కోర్టు నుంచి ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేశారు. ఈ కేసుపై విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు శిక్షను నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది. కోర్టు తీర్పుకు వ్యతిరేకంగా బాధితురాలు, మహిళా సంఘాల నేతలు నిరసన చేపట్టారు. ఈ తీర్పుపై బాధితురాలి తరఫు న్యాయవాదులు, సీబీఐ అధికారులు సుప్రీంను ఆశ్రయించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..