5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను మే 2 న ప్రకటించనున్నారు. అయితే దేశంలో కోవిద్ మహమ్మారి దృష్ట్యా ఆరోజున గానీ, ఓట్ల లెక్కింపు తరువాత గానీ విజేతలైన అభ్యర్థుల విజయోత్సవాలపై ఎన్నికల కమిషన్ నిషేధం విధించింది. ఎన్నిక ఫలితం అనంతరం గెలుపు సర్టిఫికెట్ ను అందుకునే విజేత (అభ్యర్థి) వెంట ఇద్దరికి మించి వ్యక్తులు ఉండరాదని ఈసీ తన ఉత్తర్వుల్లో పేర్కొంది. దేశంలో కొన్ని రోజులుగా రోజూ 2 వేలకు కరోనా రోగులు మరణిస్తున్నారు. కేసుల సంఖ్య 3 లక్షలకు పైగా దాటిపోయింది. బెంగాల్ లో అన్ని రోడ్ షోలను,బైక్ ర్యాలీలను బ్యాన్ చేస్తూ ఈసీ ఇటీవల నిర్ణయం తీసుకుంది. కాగా- ఇండియాలో కోవిడ్ కేసులు పెరిగి పోవడానికి ఎన్నికల కమిషన్ పూర్తిగా బాధ్యత వహించాలని మద్రాస్ హైకోర్టు నిన్న తీవ్రంగా వ్యాఖ్యానించింది. అత్యంత బాధ్యతాయుతమైన ఈ సంస్థ కోవిడ్ వ్యాప్తికి బాధ్యత వహించాలని, దీని అధికారులపై హత్యాభియోగాలు మోప వచ్చునని కూడా పేర్కొంది. మే 2 న ఓట్ల సమయంలో కోవిడ్ ప్రొటొకాల్స్ పాటించేలా చూడాలంటూ తమిళనాడు రవాణా శాఖ మంత్రి విజయభాస్కర్ దాఖలు పిటిషన్ పై విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. శుక్రవారం నాటికీ తమ ప్లాన్ ఏమిటో తమకు సమర్పించాలని ఈసీ ని కోర్టు ఆదేశించింది. లేని పక్షంలో మే 2 న ఎన్నికల ఫలితాల ప్రకటనను నిలిపివేస్తామని హెచ్చరించింది.
అటు-మిగిలిన ఎన్నికల దశలను కలిపి నిర్వహించాలన్న బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అభ్యర్థనను ఈసీ తిరస్కరించింది. రాష్ట్రంలో కోవిద్ కేసులు అత్యధికంగా ఉన్న దృష్ట్యా ఈ చర్య తీసుకోవాలన్న దీదీ కోర్కెను నిరాకరించింది. ఇక ఓట్ల లెక్కింపు రోజున కోవిడ్ నిబంధనలను కచ్చితంగా పాటించేలా చూసేందుకు ఎన్నికల కమిషన్ సరికొత్త ప్రణాలికను రూపొందించే పనిలో నిమగ్నమైంది.
మరిన్ని ఇక్కడ చూడండి: నా కుటుంబానికి ఇది అత్యంత కష్టసమయం.. కరోనా పాజిటివ్ వచ్చింది.. డాక్టర్ల సలహాలను పాటిస్తున్నా.. నటి హీనా ఖాన్..