ఇలాంటి ఐడియాలు మీకెలా వస్తాయి బ్రో.. ప్రయాగ్‌రాజ్ వెళ్లలేని వారికి బంపర్ ఆఫర్ అంటూ..

ప్రపంచంలోనే అతిపెద్ద మతపరమైన యాత్ర మహా కుంభమేళా మరో వారం రోజుల్లో ముగియనుంది. 144 సంవత్సరాల విరామం తర్వాత జరుగుతున్న 45 రోజుల మహా కుంభమేళలో గంగా, యమున, సరస్వతి వంటి పవిత్ర నదుల సంగమం జరగుతోంది. ముగిసేలోపు ఈ కార్యక్రమానికి 45 కోట్లకు పైగా భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. కానీ, ఇప్పటికీ ఈ యాత్రకు వెళ్లలేకపోయిన వారున్నారు. వారందరి కోసం ఓ వ్యక్తి బంపర్ ఆఫర్ ను ప్రకటించాడు. అతడి తెలివితేటలు చూసిన వారంతా.. ఎంతైనా ఉత్తరాది వాళ్లది బుర్రే బుర్రా అంటూ పొగిడేస్తున్నారు. ఇంతకీ అతడు ఇచ్చిన ఆఫర్ వింటే మీకు కూడా నోట మాట రాదేమో..

ఇలాంటి ఐడియాలు మీకెలా వస్తాయి బ్రో.. ప్రయాగ్‌రాజ్ వెళ్లలేని వారికి బంపర్ ఆఫర్ అంటూ..
Kumbha Mela Digital Snan

Edited By:

Updated on: Feb 22, 2025 | 7:58 PM

ఇప్పటి వరకు కుంభమేళాలో వ్యాపారం చేసుకుని కోట్లు సంపాదించిన వారున్నారు. కొందరు బొట్టు పెట్టి, మరికొందరు పూసలమ్మి ఇలా రోజుకొకరు నెట్టింట వైరలవుతున్నారు. నేనేం తక్కువా అనుకున్నాడేమో.. వారిని ఆదర్శంగా తీసుకుని ఓ యువకుడు తన స్టార్టప్ బిజినెస్ ను ప్రయాగ్ రాజ్ లో ప్రారంభించాడు. తన బిజినెస్ ఐడియాను చెబుతూ.. కుంభమేళాకు రాలేని వారికి బంపర్ ఆఫర్ అందించాడు. మహా కుంభమేళాకు హాజరు కాలేని వారు ‘డిజిటల్ ఫోటో స్నాన్’ సేవను ఎంచుకోవచ్చునని ఓ వీడియో రూపంలో తెలియజేశాడు.

భక్తులు తమ ఫొటోలను వాట్సాప్ ద్వారా తనకు పంపవచ్చని, వాటిని ప్రింట్ చేసి వారి తరపున సంగం పవిత్ర జలాల్లో ముంచుతానని గోయల్ తెలిపాడు. అతని స్టార్టప్ పేరును ప్రయాగ్ ఎంటర్‌ప్రైజెస్ గా తెలిపాడు. ఈ వర్చువల్ తీర్థయాత్ర అనుభవాన్ని రూ. 1,100 చెల్లించినవారికి అందిస్తామని.. 24 గంటల్లోపు ఆచారాన్ని పూర్తి చేస్తానని హామీ కూడా ఇస్తున్నాడు. ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్లు పంచ్ డైలాగులతో విరుచుకుపడుతున్నారు.

వీడియో చూడండి

అక్కడ చైనా వాడు డీప్ సీక్ కనిపెడితే.. మనోడు డీప్ స్నాన్ కనిపెట్టాడు అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. 7 రోజుల్లోనే ఇతడి స్టార్టప్ బిలియన్ డాలర్ కంపెనీగా మారబోతుంది అంటూ మరో నెటిజన్ సరదాగా కామెంట్ చేశాడు. భక్తులపై నీకున్న ప్రేమను ఏమనాలో అర్థం కావట్లేదు భయ్యా అంటూ ఒకరు వ్యంగంగా స్పందించారు. మొత్తానికి ఈ బంపర్ ఆఫర్ ను వినియోగించుకునేందుకు భక్తులు ఏమేరకు పోటీ పడతారో చూడాలి మరి. ఈ మహా కుంభమేళాలో ఇప్పటివరకు వస్తువులు, సేవల ద్వారా రూ.3 లక్షల కోట్ల ( సుమారు 360 బిలియన్‌ డాలర్లు) విలువైన వ్యాపారాన్ని సృష్టిస్తుందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సీఏఐటీ) తాజాగా అంచనా వేసింది.