ఉత్తర భారతాన్ని భారీ వర్షాలు బెంబేలెత్తిస్తున్నాయి. దేశంలోని అనేక ప్రాంతాల్లో వర్షం బీభత్సం సృష్టిస్తున్నాయి. ఉత్తరభారతంలో కుండపోత వర్షాలు హడలెత్తిస్తున్నాయి. ఉత్తరాఖండ్ , ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, రాజస్థాన్, హర్యాణా రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. జనజీవనం అస్తవ్యస్తంగా మారిపోయింది. దేశరాజధాని ఢిల్లీని భారీ వర్షాలు వణికిస్తున్నాయి. ఢిల్లీలోని లాహోర్ గేట్ సమీపంలో ఓ రెండంతస్థుల భవనం కూలిపోయి నాలుగేళ్ళ చిన్నారి మృతి చెందింది. 9 మందిని కాపాడారు. మరో నలుగురు భవన శిథిలాల్లో చిక్కుకున్నట్టు భావిస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. భారీ వర్షాల కారణంగా ఆదివారం ఉత్తరప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలలో తొమ్మిది మంది మరణించారు. భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ప్రకారం.. ఆదివారం రాష్ట్రంలో సగటున 22.5 మి.మీ వర్షపాతం నమోదైంది. ఇది ఆరోజు ‘దీర్ఘకాల సగటు’ (ఎల్పీఏ) కంటే 2396 శాతం ఎక్కువ.
ఢిల్లీలో గత దశాబ్దకాలంలో అక్టోబర్ నెలలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో వర్షం కురుస్తోంది. ఢిల్లీలోని లోధిరోడ్లో 87.2 మి.మీ. రెయిన్ ఫాల్ రికార్డయ్యింది. సఫ్దార్గంజ్లో 74.3 మిల్లీ మీటర్వ వర్షపాతం నమోదయ్యింది. ఇక అయాయ్నగర్లో గత 24 గంటల్లో 85.2 మి.మీ వర్షపాతం నమోదయ్యింది. దీంతో ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో జనజీవనం స్థంభించిపోయింది.
ఉత్తరాఖండ్ని ఓ వైపు వర్షాలు బెంబేలెత్తిస్తోంటే మరో వైపు మంచు వణికిస్తోంది. భారీ వర్షాలకు ఉత్తరాఖండ్ లోని చంపావత్ జిల్లాలో భారీగా కొండచరియలు విరిగిపడుతున్నాయి. పితోరఘర్ జిల్లాలోని ధార్చౌలా టౌన్లో భారీగా మంచుకురుస్తోంది.
యూపీలో ఆదివారం అత్యధికంగా 22.5 సెంటీమీటర్ల వర్షం కురిసింది. యూపిలోని పలు ప్రాంతాల్లో కుండపోత వర్షాలతో 9 మంది మరణించారు. భారీ వర్షాల కారణంగా యూపీలోని పలు జిల్లాల్లో సోమవారం పాఠశాలలను మూసివేశారు. లక్నో, అలీఘర్, మీరట్, గౌతమ్ బుద్ధ నగర్, ఘజియాబాద్లలో అన్ని పాఠశాలలకు అక్టోబర్ 12 వరకు సెలవులు ప్రకటించారు.
మరోవైపు తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తమిళనాడులోని చెన్నైతో పాటు 6 జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు ప్రాంతాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు. పుదుకొట్టై జిల్లాలో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. నీలగిరిలో భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడ్డాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం