
దేశంలో రోజురోజుకు దోపిడీలు, దొంగతనాలు, ఆన్లైన్ స్కామ్లు, సైబర్ మోసాలు పెరిగిపోతున్నాయి. మారుతున్న కాలానికి అనుగునంగా మోసగాళ్లు కూడా అప్డేట్ అవుతున్నారు. రోజుకోకొత్త రకం మోసాలతో జనాల నుంచి అందికకాడికి దోచుకుంటున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే దేశ రాజధాని ఢిల్లీలో వెలుగు చూసింది. వివేక్ విహార్ ప్రాంతంలో వ్యాపారవేత్త కార్యాలయంలోకి చొరబడి, సీబీఐ అధికారులమంటూ ఒక ముఠా హల్చల్ చేసింది. ఆ తర్వాత ఆఫీస్ నుంచి సుమారు రూ.2.3 కోట్ల నగదును దోచుకెళ్లంది. ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. ఈ ముఠాలోని సభ్యులు అస్సాం రాష్ట్రానికి చెందిన వారిగా గుర్తించారు.
వివరాల్లోకి వెళ్తే.. గాజియాబాద్కు చెందిన వ్యాపారవేత్త మన్ప్రీత్ సింగ్ తన ఆఫీసులో భారీ మొత్తంలో నగదు దాచిపెట్టాడు. అందులో ఒక భాగంగా ఉన్న రూ.1.10 కోట్లను మూడ్రోజుల క్రితం తీసుకురావాలని తన స్నేహితుడు రవిశంకర్ను కోరాడు. రవిశంకర్ ఆ డబ్బు సంచిని తీసుకుని బయటకు వస్తుండగానే రెండు కార్లలో వచ్చిన నలుగురు వ్యక్తులు అతడిని అడ్డగించారు .. వారిలో ఒక మహిళ కూడా ఉన్నారు.“మేము సీబీఐ అధికారులు” అని పరిచయం చేసుకుని అతడిని బెదిరించారు. వెంటనే రవిశంకర్పై దాడి చేసి, అతని చేతిలో ఉన్న నగదు సంచిని లాక్కొన్నారు. ఇంతటితో ఆగిపోకుండా అతడిని మళ్లీ కార్యాలయం లోపలికి లాగి, అక్కడ దాచిన మిగిలిన నగదును కూడా సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి మెల్లగా జారుకున్నారు.
ఇక ఘటనపై మన్ప్రీత్ ఫిర్యాదు చేయడంతో ఢిల్లీ పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. సీసీటీవీ ఫుటేజ్, ఫోన్ రికార్డులు, అనుమానితుల కదలికలను పరిశీలించి చివరకు ముఠా జాడను కనుగొన్నారు. దర్యాప్తులో అస్సాం రాష్ట్రానికి చెందిన ఓ ఎన్జీవో కార్యదర్శి పపోరి బరుహా, తుగలకాబాద్కు చెందిన దీపక్లను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.1.08 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు. అయితే మిగిలిన సుమారు రూ.1.2 కోట్లు ఇంకా దొరకలేదు. అలాగే ముఠాలో భాగమైన ఇతర వ్యక్తులు ఇంకా పరారీలోనే ఉన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.