PK-Congress: కాంగ్రెస్‌కు పీకే పొత్తు ఫార్ములాలు.. ఏపీలో వైసీపీతో జట్టుకట్టాలని సలహా.. తెలంగాణలో

ఇకమీదట పార్టీలో ‘ఒక వ్యక్తి - ఒకే పదవి’ అన్న సిద్ధాంతాన్ని అనుసరించాలని సూచించారు. అన్ని స్థాయిల్లో ఎన్నికలు నిర్వహించి పార్టీ అనుబంధ సంస్థలను ప్రక్షాళన చేయాలని పీకే ప్రతిపాదించారు.

PK-Congress:  కాంగ్రెస్‌కు పీకే పొత్తు ఫార్ములాలు.. ఏపీలో వైసీపీతో జట్టుకట్టాలని సలహా.. తెలంగాణలో
Congress Pk

Updated on: Apr 22, 2022 | 10:54 AM

Congress Reincarnation Plan: పీకే ఫార్ములా.. తెలుగు రాష్ట్రాల్లో(Telugu states) సంచలనం రేపుతోంది. ఢిల్లీ(Delhi)లో కాంగ్రెస్‌ హైకమాండ్‌కు ఆయనిచ్చిన పవర్‌ పాయింట్‌ ప్రెజెంటేషన్‌.. గల్లీల్లో రీసౌండ్ ఇస్తోంది. ఎందుకంటే.. ఏపీ(Ap)లో వైసీపీ(Ysrcp)తో పొత్తు పెట్టుకోవాలని సోనియా గాంధీ(Sonia Gandhi)కి సలహా ఇచ్చారు ప్రశాంత్‌ కిషోర్. తెలంగాణలో మాత్రం ఒంటరి పోరాటమే పార్టీకి కలిసొస్తుందని సూచన చేశారాయన. దేశవ్యాప్తంగా పూర్వ వైభవం సాధించేందుకు కాంగ్రెస్‌ పావులు కదుపుతోంది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో 17 రాష్ట్రాల్లోని 358 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేయాలని … అలానే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలంగాణలో ఒంటరిగా పోటీగా బరిలోకి దిగి… ఏపీలో వైసీపీతో జట్టు కట్టాలని వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ కాంగ్రెస్‌ అధిష్టానానికి సూచించారు. కాంగ్రెస్‌ అధిష్ఠానానికి ఇచ్చిన పవర్‌ పాయింట్‌ ప్రెజెంటేషన్‌ బయటికొచ్చింది. తమిళనాడులో డీఎంకేతో, మహారాష్ట్రలో ఎన్సీపీతో, పశ్చిమబెంగాల్‌లో తృణమూల్‌ కాంగ్రెస్‌తో, ఝార్ఖండ్‌లో జేఎంఎంతో కలిసి వెళ్లడం మేలని ప్రశాంత్‌ కిశోర్‌ ప్రతిపాదించారు. జమ్మూ-కశ్మీర్‌లో నేషనల్‌ కాన్ఫరెన్స్‌, ఈశాన్య రాష్ట్రాల్లో అక్కడి భాగస్వామ్య పక్షాలతో కలిసి వెళ్లాలని సూచించారు.

ఈ పార్టీలన్నీ 2019 ఎన్నికల్లో 128 స్థానాల్లో విజయం సాధించగా.. మరో 249 స్థానాల్లో రెండో స్థానంలో నిలిచినట్లు ప్రశాంత్‌ కిశోర్‌ వెల్లడించారు. మొదటి, రెండు స్థానాల్లో నిలిచిన సీట్లన్నీ కలిపితే 377 అవుతాయని, వచ్చే ఎన్నికల్లో వీటిపై దృష్టి సారిస్తే భారీగా పుంజుకోవడానికి అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. బీజేపీతో ముఖాముఖి తలపడే రాష్ట్రాల్లో ఒంటరిగా పోటీచేసి, మిగిలిన చోట్ల 5-6 పార్టీలతో వ్యూహాత్మక పొత్తులు పెట్టుకుంటే పార్టీ విజయావకాశాలు గణనీయంగా మెరుగవుతాయని ప్రతిపాదించారు.

యూపీఏ ఛైర్‌పర్సన్‌గా పాతతరం కాంగ్రెస్‌ నాయకుడిని పెట్టి, కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా సోనియా గాంధీ కొనసాగడం.. వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా గాంధీయేతర కుటుంబ సభ్యుడిని నియమించడం.. పార్లమెంటరీ బోర్డు నాయకుడిగా రాహుల్‌గాంధీని ఎన్నుకోవడం… కోఆర్డినేషన్‌ జనరల్‌ సెక్రటరీగా ప్రియాంకా గాంధీని నియమించడం లేదా సోనియాను యూపీఏ ఛైర్‌పర్సన్‌గా ఎన్నుకోవడం చేయాలన్నారు పీకే. రాహుల్‌ను పార్లమెంటరీ బోర్డు నాయకుడిగా చేయడం వల్ల చట్టసభలో ప్రధాని ‘వర్సెస్‌’ రాహుల్‌ గాంధీగా మారుతుందని, దీనివల్ల ప్రజల గొంతును పార్లమెంటు లోపల, బయట బలంగా వినిపించడానికి వీలవుతుందని ప్రశాంత్‌ కిశోర్‌ పేర్కొన్నారు. ఇకమీదట పార్టీలో ‘ఒక వ్యక్తి – ఒకే పదవి’ అన్న సిద్ధాంతాన్ని అనుసరించాలని సూచించారు. అన్ని స్థాయిల్లో ఎన్నికలు నిర్వహించి పార్టీ అనుబంధ సంస్థలను ప్రక్షాళన చేయాలని ప్రతిపాదించారు. దేశవ్యాప్తంగా 15 వేల మంది నిబద్ధత గల నాయకులను, కోటి మంది క్రియాశీలక కార్యకర్తలను గుర్తించి వారికి పార్టీ ప్రధాన బాధ్యతలు అప్పగించాలని పేర్కొన్నారు. పార్టీ సంస్థాగతంగా రెండు విధాలుగా పని చేయాలని సూచించారు. ఒక విభాగం కాంగ్రెస్‌ను ‘పాన్‌ ఇండియా పార్టీ’గా విస్తరించడంపై దృష్టి సారిస్తే, రెండో విభాగం 2024 ఎన్నికలకు అవసరమైన బలమైన వ్యవస్థను సృష్టించే పనిలో నిమగ్నం కావాలని పేర్కొన్నారు.

Also Read: Viral Video: రోడ్డు వేయమని అడిగినందుకు.. యువకుడి చెంప చెల్లుమనిపించిన ఎమ్మెల్యే