Rahul Gandhi: వ్యవసాయ చట్టాల లాగా అగ్నిపథ్ నూ వెనక్కు తీసుకుంటారు.. రాహుల్ గాంధీ షాకింగ్ కామెంట్స్

|

Jun 22, 2022 | 5:50 PM

Agnipath Scheme: అగ్నిపథ్(Agnipath) పథకాన్ని వెనక్కు తీసుకోవాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) మరోసారి డిమాండ్ చేసారు. ఈ పథకం ద్వారా కేంద్రం సైన్యాన్ని బలహీనపరుస్తుందని ఆరోపించారు. వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకున్నట్లే ప్రధాని...

Rahul Gandhi: వ్యవసాయ చట్టాల లాగా అగ్నిపథ్ నూ వెనక్కు తీసుకుంటారు.. రాహుల్ గాంధీ షాకింగ్ కామెంట్స్
Rahul Gandhi
Follow us on

అగ్నిపథ్(Agnipath) పథకాన్ని వెనక్కు తీసుకోవాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) మరోసారి డిమాండ్ చేసారు. ఈ పథకం ద్వారా కేంద్రం సైన్యాన్ని బలహీనపరుస్తుందని ఆరోపించారు. వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకున్నట్లే ప్రధాని నరేంద్ర మోదీ అగ్నిపథ్​ పథకాన్ని ఉపసంహరించుకోవాలన్నారు. ఈడీ(ED Investigation) దర్యాప్తులో భాగంగా తనకు సహకరించిన, మద్దతిచ్చిన వారందరికీ రాహుల్ కృతజ్ఞతలు తెలిపారు. విచారణ సమయంలో తాను ఒంటరిగా లేనని, ప్రజాస్వామ్యం కోసం పోరాడుతున్న వారందరూ తనతో ఉన్నారని వెల్లడించారు. దేశంలోని యువతను నిరుద్యోగం అనే అగ్నిబాటలో నడిచేలా ప్రధాని మోడీ వ్యవహరిస్తున్నారని రాహుల్ గాంధీ విమర్శించారు. దేశాన్ని ముగ్గురు పారిశ్రామికవేత్తలకు అప్పగించిన ప్రధాని అగ్నిపథ్ పథకంతో ఆర్మీలో ఉద్యోగావకాశాలు లేకుండా చేస్తున్నారని రాహుల్ గాంధీ తీవ్రంగా విమర్శించారు. మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంటారని తాను అప్పుడే చెప్పానని, ఇప్పుడు అగ్నిపథ్​ పథకాన్ని కూడా ఉపసంహరించుకుంటారని రాహుల్​గాంధీ విశ్వాసం వ్యక్తం చేశారు.

మరోవైపు.. త్రివిధ దళాల్లో సైనిక నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం అగ్నిపథ్‌ పథకాన్ని తీసుకువచ్చింది. ఈ పథకం కింద ఎపికైన వారికి సైనిక బలగాల్లో కొత్త ర్యాంకు ఇస్తూ అగ్నిపథ్‌ రిక్రూట్‌మెంట్‌ పాలసీని కేంద్రం ప్రకటించింది. అగ్నివీర్‌కు ఎంపికైనవారికి ఆరు నెలల పాటు శిక్షణ ఇవ్వనున్నట్లు కేంద్ర మంత్రి రాజ్ నాథ్ తెలిపారు. నాలుగేళ్ల సర్వీస్‌ తర్వాత ఉద్యోగాల నుంచి రిలీవ్‌ చేయనున్నారు. 25 శాతం మందికి తాత్కాలికంగా సర్వీస్‌లో కొనసాగించనున్నట్లు చెప్పారు. వీరికి నెలకు రూ.30వేల నుంచి రూ.40వేల వరకు జీతం ఉంటుందని, అలాగే రూ.48 లక్షల వరకు జీవిత బీమా కల్పించనున్నట్లు స్పష్టం చేశారు.

కాగా.. సైనిక నియామకాల కోసం తీసుకువచ్చిన అగ్నిపథ్ పథకాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. బిహార్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, పంజాబ్, తెలంగాణ రాష్ట్రాల్లో జరిగిన నిరసనలు ఉద్రిక్తంగా మారుతున్నాయి. ప్రభుత్వం వెంటనే ఈ పథకాన్ని వెనక్కు తీసుకోవాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. అప్పటివరకు ఆందోళనలు విరమించేది లేదని స్పష్టం చేశారు.

జాతీయ వార్తల కోసం