ఆపరేషన్‌ సిందూర్‌పై కల్నల్‌ సోఫియా ఖురేషి తల్లి ఏమన్నారో తెలుసా? ప్రతి భారతీయుడి గుండె గర్వంతో ఉప్పొంగే మాటలు

ఆపరేషన్ సిందూర్ తర్వాత కల్నల్ సోఫియా ఖురేషి కుటుంబం తమ సంతోషాన్ని వ్యక్తం చేసింది. పహల్గామ్ దాడి బాధితులకు న్యాయం చేసినందుకు వారు గర్వపడుతున్నారు. సోఫియా తండ్రి, తల్లి, సోదరుడు ఆమె ధైర్యాన్ని, దేశభక్తిని ప్రశంసిస్తూ, పాకిస్తాన్‌కు తగిన బుద్ధి చెప్పినందుకు సంతోషం వ్యక్తం చేశారు.

ఆపరేషన్‌ సిందూర్‌పై కల్నల్‌ సోఫియా ఖురేషి తల్లి ఏమన్నారో తెలుసా? ప్రతి భారతీయుడి గుండె గర్వంతో ఉప్పొంగే మాటలు
Colonel Sophia Qureshi And

Updated on: May 08, 2025 | 10:56 AM

ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్తాన్‌తో పాటు పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై భారత్‌ క్షిపణి దాడులు చేసింది. ఈ ఆపరేషన్‌లో కల్నల్ సోఫియా ఖురేషిపై ప్రశంసల వర్షం కురిసింది. తాజాగా ఆమెకు కుటుంబ సభ్యులు ఈ ఆపరేషన్‌ సిందూర్‌పై స్పందించారు. ఇటీవలి పహల్గామ్ ఉగ్రవాద దాడి బాధితులకు ఈ ఆపరేషన్ న్యాయం చేసిందని కల్నల్ ఖురేషి తల్లి హలీమా ఖురేషి మాట్లాడుతూ.. “మా సోదరీమణులు, తల్లుల సిందూర్లకు మేము ప్రతీకారం తీర్చుకున్నాం. ఇది మా కుటుంబానికి, మొత్తం దేశానికి చాలా గర్వకారణమైన క్షణం” అని అన్నారు. భారత సైన్యంలో పనిచేసిన తన తండ్రి, తాత స్ఫూర్తితో సాయుధ దళాలలో సేవ చేయాలని సోఫియా చాలా కాలంగా కోరుకునేదని ఆమె గుర్తు చేసుకున్నారు.

“చిన్నప్పుడు, ఆమె పెద్దయ్యాక సైన్యంలో చేరతానని చెప్పేది” అని ఆమె అన్నారు. కల్నల్ ఖురేషి తండ్రి తాజ్ మొహమ్మద్ ఖురేషి మాట్లాడుతూ.. “మేము చాలా గర్వపడుతున్నాం. మా కూతురు మన దేశం కోసం గొప్ప పని చేసింది. పాకిస్తాన్ నాశనం కావాలి, నా తాత, నా తండ్రి, నేను అందరం సైన్యంలో ఉన్నాం, ఇప్పుడు ఆమె కూడా అదే దారిలో ఉంది..” అని అన్నారు. ఆమె సోదరుడు మహమ్మద్ సంజయ్ ఖురేషి కూడా ఇలాంటి భావాలను వ్యక్తం చేస్తూ.. దేశం ఈ క్షణం కోసం చాలా కాలంగా ఎదురుచూస్తోందని అన్నారు. “ఈ రకమైన ప్రతిస్పందన కోసం మేం చాలా కాలంగా ఎదురుచూస్తున్నాం. ఇంత ముఖ్యమైన ఆపరేషన్ గురించి దేశానికి వివరించేది తమ కుటుంబ సభ్యుడే అని మేము ఎప్పుడూ ఊహించలేదు. ఇది మాకు గర్వకారణమైన క్షణం” అని ఆయన అన్నారు.

పహల్గామ్ బాధితులకు న్యాయం

పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కశ్మీర్ (PoK) లోని తొమ్మిది ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకున్న ఆపరేషన్ సిందూర్ గురించి కల్నల్ సోఫియా ఖురేషి, విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ బుధవారం న్యూఢిల్లీలో మీడియాకు వివరించారు. ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రవాద దాడిలో నేపాలీ జాతీయుడితో సహా 26 మంది ప్రాణాలు కోల్పోయిన బాధితులకు న్యాయం అందించే లక్ష్యంతో ఈ దాడులు చేసినట్లు వారు వెల్లడించిన విషయం తెలిసిందే.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..