LK Advani: ఎల్‌కే అద్వానీకి తీవ్ర అస్వస్థత , ఢిల్లీ ఎయిమ్స్‌ లో చికిత్స.. ప్రమాదం లేదన్న కుటుంబ సభ్యులు

|

Jun 27, 2024 | 6:54 AM

ప్రస్తుతం అద్వానీని ఎయిమ్స్‌లోని వృద్ధాప్య విభాగం వైద్యుల పర్యవేక్షణలో ఉంచి చికిత్సనందిస్తున్నారు. లాల్ కృష్ణ అద్వానీ కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. రొటీన్ చెకప్ కోసం మాత్రమే ఎయిమ్స్‌లో చేర్చినట్లు వెల్లడించారు. ప్రస్తుతం లాల్ కృష్ణ అద్వానీ ఆరోగ్యం బాగానే ఉందని భయపడల్సిన అవసరం లేదని చెప్పారు.

LK Advani: ఎల్‌కే అద్వానీకి తీవ్ర అస్వస్థత , ఢిల్లీ ఎయిమ్స్‌ లో చికిత్స.. ప్రమాదం లేదన్న కుటుంబ సభ్యులు
Lk Advani Hospitalised
Follow us on

భారతీయ జనతా పార్టీ (బీజేపీ) సీనియర్ నాయకుడు.. మాజీ ఉప ప్రధాని లాల్ కృష్ణ అద్వానీ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ బుధవారం అర్థరాత్రి ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరినట్లు తెలుస్తోంది. వృద్ధాప్య సమస్య కారణంగా అద్వానీని ఎయిమ్స్‌లో చేర్చినట్లు సమాచారం. అద్వానీని కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న బిరుదుతో సత్కరించారు.

ప్రస్తుతం అద్వానీని ఎయిమ్స్‌లోని వృద్ధాప్య విభాగం వైద్యుల పర్యవేక్షణలో ఉంచి చికిత్సనందిస్తున్నారు. లాల్ కృష్ణ అద్వానీ కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. రొటీన్ చెకప్ కోసం మాత్రమే ఎయిమ్స్‌లో చేర్చినట్లు వెల్లడించారు. ప్రస్తుతం లాల్ కృష్ణ అద్వానీ ఆరోగ్యం బాగానే ఉందని భయపడల్సిన అవసరం లేదని చెప్పారు.

ఈ ఏడాది భారతరత్న అందుకున్న అద్వానీ

ఈ ఏడాది మార్చి 30న భారతరత్న అవార్డును లాల్ కృష్ణ అద్వానీ అందుకున్నారు. 2015 సంవత్సరంలో అద్వానీకి దేశంలో రెండవ అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్ లభించిన సంగతి తెలిసిందే.. ఈ ఏడాది ఫిబ్రవరిలో భారతరత్న బిరుదుతో అద్వానీని సత్కరిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అనంతరం ఎల్‌కె అద్వానీ స్పందిస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ ప్రకటనలో తాను భారతరత్న అవార్డును గౌరవంగా స్వీకరిస్తున్నానని.. ఈ అవార్డ్ అందుకోవడం అంటే మనం జీవితంలో అనుసరించిన ఆలోచనలు, నడిచిన దారి, సూత్రాలకు దక్కిన గౌరవం ఇది అని చెప్పారు.

ఇవి కూడా చదవండి

అద్వానీని భారతరత్నతో సత్కరించిన సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ.. అద్వానీ తన జీవితమంతా దేశసేవలో గడిపారని అన్నారు. ఆయన దేశానికి చేసిన సేవను దేశం ఎప్పటికీ మరచిపోదన్నారు. దేశానికి సేవ చేయడంలో ఆయన చేసిన కృషి సాటిలేనిది.. మరువలేనిదని చెప్పారు.

మూడుసార్లు బీజేపీ అధ్యక్షుడిగా అద్వానీ

అయోధ్యలో రామమందిర ఉద్యమంలో అగ్రగామిగా నిలిచిన లాల్ కృష్ణ అద్వానీ భారతీయ జనతా పార్టీని జాతీయ స్థాయికి తీసుకురావడానికి ఎనలేని కృషి చేశారు. అద్వానీ తన రాజకీయ జీవితాన్ని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) ద్వారా ప్రారంభించారు. భారతీయ జనతా పార్టీకి పునాది వేసిన నాయకులలో ఆయన ఒకరు.

అద్వానీ మూడుసార్లు బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్నారు. 1986లో తొలిసారి పార్టీ అధ్యక్షుడిగా పని చేయడం మొదలు పెట్టి.. 1990 వరకు అధ్యక్ష పదవిలో కొనసాగారు. రెండవ సారి అద్వానీ 1993లో పార్టీ అధ్యక్షుడయ్యారు.. 1998 వరకు ఆ పదవిలో కొనసాగారు. 2004లో మూడోసారి చివరిసారి అధ్యక్షుడిగా ఎన్నికై 2005 వరకు ఆ పదవిలో కొనసాగారు.

ఏడో ఉప ప్రధానిగా అద్వానీ

అద్వానీ 50 ఏళ్లకు పైగా క్రియాశీల రాజకీయ జీవితంలో.. 1998లో బిజేపీ నేతృత్వంలోని ఎన్‌డిఏ ప్రభుత్వంలో హోం మంత్రిగా పనిచేశారు. అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వంలో హోంమంత్రిగా పనిచేసిన ఆయన 2002లో దేశానికి ఉప ప్రధానమంత్రి అయ్యారు.

అద్వానీ దేశానికి ఏడో ఉప ప్రధానిగా కూడా పనిచేశారు. అంతేకాదు 10వ, 14వ లోక్‌సభ సమయంలో ప్రతిపక్ష నేతగా అద్వానీ ఉన్నారు. అనేక సార్లు ఎంపీగా ఉన్నారు. 1970లో రాజ్యసభ ద్వారా తొలిసారి ఎంపీ అయ్యారు. అద్వానీ 7 సార్లు లోక్‌సభ ఎంపీగా, 4 సార్లు రాజ్యసభ ఎంపీగా ఎన్నికయ్యారు.

 

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..