రసవత్తరంగా మహా రాజకీయం.. ఉద్దవ్ థాకరే‌కు చెక్ పెట్టేందుకు బీజేపీ మరో వ్యూహం

|

Jul 14, 2022 | 11:37 AM

Amit Thackeray: మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన(MNS) చీఫ్ రాజ్ థాకరే తనయుడు అమిత్ థాకరే‌కు మంత్రి పదవిని బీజేపీ ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. ఆ మేరకు బీజేపీ నేతలు రాజ్ థాకరే‌తో చర్చలు జరిపినట్లు సమాచారం.

రసవత్తరంగా మహా రాజకీయం.. ఉద్దవ్ థాకరే‌కు చెక్ పెట్టేందుకు బీజేపీ మరో వ్యూహం
Follow us on

Maharastra Politics: మహారాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. శివసేన రెబల్ నేత ఏక్‌నాథ్ షిండే(Eknath Shinde) వర్గం తిరుగుబాటులో శివసేన – ఎన్సీపీ- కాంగ్రెస్ సంకీర్ణ సర్కారు(ఎంవీఏ) కూలిపోవడం.. అక్కడ ఏక్‌నాథ్ వర్గం – బీజేపీ కూటమి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం తెలిసిందే. ఏక్‌నాథ్ షిండే మహారాష్ట్ర కొత్త సీఎం కాగా.. దేవేంద్ర ఫడ్నవిస్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. రాష్ట్రపతి ఎన్నికల తర్వాత జులై 19న మంత్రివర్గ విస్తరణ చేపట్టాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఉద్దవ్ థాకరే‌కు చెక్ పెట్టేందుకు బీజేపీ భారీ స్కెచ్ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన(MNS) చీఫ్ రాజ్ థాకరే తనయుడు అమిత్ థాకరే‌కు మంత్రి పదవిని బీజేపీ ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. ఆ మేరకు బీజేపీ నేతలు రాజ్ థాకరే‌కు ప్రతిపాదనలు పంపినట్లు సమాచారం.

ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీ కాని అమిత్ థాకరే‌కు మంత్రి పదవిని ఆఫర్ చేయడం మహారాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఉద్దవ్ థాకరేకు చెక్ పెట్టే..  రాజకీయ వ్యూహంతోనే రాజ్ థాకరే తనయుడికి మంత్రి పదవిని ఇచ్చేందుకు బీజేపీ ముందుకొచ్చినట్లు తెలుస్తోంది. అమిత్ థాకరేను కేబినెట్‌లోకి తీసుకుంటే రాజకీయంగా ఉద్దవ్‌ను పూర్తిగా కట్టడి చేయొచ్చని బీజేపీ నేతలు భావిస్తున్నారు.

శివసేన పార్టీపై ఉద్దవ్ థాకరే ప్రభావాన్ని తగ్గించే వ్యూహంతోనే ఆ పార్టీ రెబల్ నేత ఏక్‌నాథ్ షిండేకు బీజేపీ ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టింది. రాజ్ థాకరే తనయుడిని మంత్రివర్గంలోకి తీసుకోవడం ద్వారా శివసేన పార్టీపై ఉద్దవ్ థాకరే ప్రాభవాన్ని మరింత తగ్గించొచ్చని కమలనాథులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అధికారంలో ఉన్నప్పుడు ఉద్దవ్ థాకరే, ఆయన తనయుడు ఆదిత్య థాకరే అంతా తామే అన్నట్లు వ్యవహరించారు. రాజ్ థాకరే తనయుడు అమిత్ థాకరేను మంత్రిని చేయడం ద్వారా యువత మధ్య ఆదిత్య థాకరే‌‌కున్న క్రేజ్‌ను కూడా తగ్గించవచ్చని భావిస్తున్నారు. మహారాష్ట్ర నాయకుల్లో అమిత్ థాకరే, ఆదిత్య థాకరేలకు యువ నాయకులుగా గుర్తింపు ఉంది.

ఇవి కూడా చదవండి

Amit Thackeray

అయితే బీజేపీ ఆఫర్‌ను రాజ్ థాకరే నిరాకరించారన్న కథనాలు కూడా వినిపిస్తున్నాయి. అమిత్ థాకరేకు బీజేపీ మంత్రి పదవి ఆఫర్ చేసిందన్న కథనాలపై స్పందించేందుకు ఎంఎన్ఎస్ నేతలు నిరాకరించారు. అటు బీజేపీ నేతలు కూడా ఈ విషయంపై మీడియాతో మాట్లాడేందుకు నిరాకరిస్తున్నారు. డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ ఇవాళ (బుధవారం) రాజ్ థాకరేతో భేటీ అవుతారని ప్రచారం జరిగినా.. అనివార్య కారణాలతో ఈ భేటీ వాయిదాపడినట్లు తెలుస్తోంది.

మరిన్ని జాతీయ వార్తలు చదవండి..