Modi 3.0: తెలుగు రాష్ట్రాలకు పదవుల పంట.. స్పీకర్, బీజేపీ అధ్యక్ష రేసులో తెలుగు నేతలు..!

కేంద్ర మంత్రివర్గం కూర్పు, శాఖల కేటాయింపు పర్వం ముగిసింది. పలువురు కేంద్రమంత్రులు బాధ్యతలు స్వీకరించారు. ఇక మరికొన్ని కీలక పదవుల భర్తీ మిగిలి ఉంది. ఈసారి లోక్‌సభ స్పీకర్ స్థానం ఎవరికి కట్టబెడతారు అన్న చర్చ దేశ రాజకీయ వర్గాల్లో విస్తృతంగా జరుగుతోంది.

Modi 3.0: తెలుగు రాష్ట్రాలకు పదవుల పంట.. స్పీకర్, బీజేపీ అధ్యక్ష రేసులో తెలుగు నేతలు..!
Narendra Modi 3.0 Cabinet
Follow us

| Edited By: Balaraju Goud

Updated on: Jun 11, 2024 | 5:30 PM

కేంద్ర మంత్రివర్గం కూర్పు, శాఖల కేటాయింపు పర్వం ముగిసింది. పలువురు కేంద్రమంత్రులు బాధ్యతలు స్వీకరించారు. ఇక మరికొన్ని కీలక పదవుల భర్తీ మిగిలి ఉంది. పార్లమెంటు నిర్వహణలో అత్యంత కీలకమైన స్థానం లోక్‌సభ స్పీకర్‌ది. ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీ తొలి ఐదేళ్ల కాలం (16వ లోక్‌సభ) సుమిత్రా మహాజన్ స్పీకర్‌గా వ్యవహరించగా, 17వ లోక్‌సభలో రాజస్థాన్ నేత ఓం బిర్లా స్పీకర్‌గా పనిచేశారు. ఈసారి ఆ స్థానం ఎవరికి కట్టబెడతారు అన్న చర్చ దేశ రాజకీయ వర్గాల్లో విస్తృతంగా జరుగుతోంది. వరుసగా రెండు పర్యాయాలు ఉత్తరాదికి చెందిన నేతలకే ఆ పదవిని ఇచ్చినందున, ఈసారి దక్షిణాదికి చెందిన నేతకు ఇచ్చే అవకాశం ఉందని భారతీయ జనతా పార్టీ (BJP) వర్గాల ద్వారా తెలిసింది.

దక్షిణాదిలో పార్టీని విస్తరించేందుకు అష్టకష్టాలు పడుతూ అనేక వ్యూహాలను అమలు చేస్తున్న కమలనాథులు.. ఈ పదవిని దక్షిణాదిలో కీలకమైన నేతకు ఇవ్వడం ద్వారా కొంత ప్రయోజనం పొందవచ్చని భావిస్తున్నారు. ఈసారి దక్షిణ భారతదేశంలో బీజేపీ తమిళనాడు మినహా మిగతా అన్ని రాష్ట్రాల్లో ఖాతా తెరిచింది. వాటిలో కర్ణాటక నుంచి అత్యధికంగా 17 స్థానాలు గెలుచుకోగా, ఆ తర్వాతి స్థానంలో 8 సీట్లతో తెలంగాణ నిలిచింది. ఆంధ్రప్రదేశ్ 3 సీట్లు గెలుచుకోగా, కేరళ ఒక సీటుతో తొలిసారి ఖాతా తెరిచింది. మొత్తంగా దక్షిణాదిన 29 సీట్లు గెలుచుకోగా, కేంద్ర మంత్రివర్గ కూర్పులో భాగంగా బీజేపీ అగ్రనేతలు అన్ని రాష్ట్రాలకు ప్రాతినిథ్యం కల్పించారు.

తమిళనాడు నుంచి లోక్‌సభకు ఒక్కరు కూడా గెలవకపోయినా… డా. ఎల్. మురుగన్‌ను రాజ్యసభ ద్వారా కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకున్నారు. ఇలా మొత్తంగా దక్షిణ భారతదేశం నుంచి 10 మందికి కేంద్ర మంత్రివర్గంలో చోటు దొరికింది. కానీ కొన్ని సామాజిక సమీకరణాల కారణంగా ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరికి మంత్రివర్గంలో చోటు కల్పించలేకపోయారు. ఆమె యూపీఏ ప్రభుత్వ హయాంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. గత పదేళ్లుగా భారతీయ జనతా పార్టీలో వివిధ హోదాల్లో సేవలు అందిస్తున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలిగా ఉండి రాష్ట్రంలో కూటమి విజయంలో భాగమయ్యారు. అయినప్పటికీ మంత్రివర్గంలో చోటు దక్కకపోవడానికి కారణం సామాజిక సమీకరణాలు.

తెలుగుదేశం పార్టీ నుంచి మంత్రివర్గంలో కే. రామ్మోహన్ నాయుడు (కేబినెట్ మంత్రి), డా. పెమ్మసాని చంద్రశేఖర్ (సహాయ మంత్రి) ఉన్నారు. పురందేశ్వరి – పెమ్మసాని ఒకే సామాజికవర్గం. ఒకే రాష్ట్రం నుంచి ఉన్న ముగ్గురు కేంద్ర మంత్రుల్లో ఇద్దరు ఒకే సామాజికవర్గానికి చెందినవారు ఉండడం సరికాదని బీజేపీ అధిష్టానం భావించినట్టు తెలిసింది. అందుకే పురందేశ్వరికి అన్ని అర్హతలు ఉన్నప్పటికీ కేంద్ర మంత్రివర్గంలో చోటు లభించలేదన్న చర్చ జరుగుతోంది. అంతమాత్రాన ఆమెను ఓ సాదాసీదా ఎంపీగా మాత్రమే కూర్చోబెట్టాలని పార్టీ భావించడం లేదట. కీలకమైన లోక్‌సభ స్పీకర్ బాధ్యతలు అప్పగించాలన్న ఆలోచనలో కమలదళం అగ్రనేతలు ఉన్నట్టు సమాచారం.

పురందేశ్వరిని స్పీకర్‌ పదవికి పరిశీలించడం ద్వారా పార్టీ బహుళ ప్రయోజనాలను ఆశిస్తున్నట్టుగా కనిపిస్తోంది. “నారీ శక్తి” నినాదంతో మహిళా రిజర్వేషన్లను పాస్ చేసిన మోదీ సర్కార్, మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని చూస్తోంది. ఇప్పటికే భారత రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ఉన్నారు. ఇప్పుడు లోక్‌సభ స్పీకర్ పదవితో పాటు బీజేపీ జాతీయాధ్యక్ష బాధ్యతల్ని సైతం మహిళలకే అప్పగించే ఆలోచనలో ఉన్నట్టు చర్చ జరుగుతోంది. మరోవైపు దక్షిణ భారతదేశంలో పార్టీని విస్తరించాలని బలంగా కోరుకుంటున్న కమలదళం, అందుకు కలిసొచ్చే ఏ చిన్న అవకాశాన్నీ వదులుకోదల్చుకోవడం లేదు. ఈ క్రమంలో పురందేశ్వరిని స్పీకర్ పదవి కోసం అధినాయకత్వం పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది.

అయితే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఎవరూ ఊహించని వ్యక్తిని తెరపైకి తీసుకొచ్చిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. 17వ లోక్‌సభకు స్పీకర్ ఎవరు అన్న ఊహాగానాలు చెలరేగినప్పుడు, మీడియాలో అనేక మంది పేర్లు ప్రస్తావనకు వచ్చాయి. కానీ ఎవరి ఊహకు అందకుండా రాజస్థాన్ కోటా నుంచి వరుసగా గెలుపొందుతూ వస్తున్న ఓం బిర్లాను స్పీకర్‌గా నిర్ణయించి మోదీ – షా ద్వయం అందరినీ విస్మయానికి గురిచేసింది. ఈసారి కూడా అలాగే చేస్తారా లేక చర్చలో ఉన్న పురందేశ్వరికే అవకాశం కల్పిస్తారా అన్నది ఉత్కంఠగా మారింది.

అధ్యక్ష బాధ్యతలూ దక్షిణాదికే?

కుటుంబ ఆధారిత పార్టీగా కాకుండా పూర్తిగా సిద్ధాంతంపై నడుస్తున్న భారతీయ జనతా పార్టీ (BJP)లో అధ్యక్షులుగా దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందినవారు పనిచేశారు. దక్షిణ భారతదేశం నుంచి ఎం. వెంకయ్య నాయుడు, బంగారు లక్ష్మణ్ సహా పలువురు ఈ బాధ్యతల్ని నిర్వర్తించారు. గత పదేళ్ల కాలంలో నితిన్ గడ్కరీ, రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా, జేపీ నడ్డా వంటి ఉత్తరాది రాష్ట్రాలకు చెందినవారే అధ్యక్షులుగా వ్యవహరించారు. ఈసారి దక్షిణ భారతదేశంలో పార్టీని మరింత పటిష్టం చేయాలని చూస్తున్న కమలదళం, ఆ లక్ష్యాన్ని సాధించే క్రమంలో దక్షిణాదికి చెందిన నేతకు పార్టీ అధ్యక్ష బాధ్యతల్ని అప్పగించాలని చూస్తోంది. హిందీ మాట్లాడే రాష్ట్రాలతో పాటు పశ్చిమాన గుజరాత్‌, తూర్పున అస్సాంలో మాత్రమే బీజేపీకి పట్టు కొనసాగుతోంది.

దక్షిణ భారతదేశంలో ఇంతకాలం పాటు కర్ణాటక మినహా మరెక్కడా వారికి అవకాశం లేకపోయింది. ఈ ఎన్నికల్లో తెలంగాణలో సగం స్థానాలు గెలుపొందడం, కేరళలో ఖాతా తెరవడం కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో సైతం పార్టీని బలోపేతం చేసేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసింది. ఈ క్రమంలో దక్షిణాది నుంచి అధ్యక్ష బాధ్యతలు కట్టబెట్టాలి అనుకుంటే.. బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయాధ్యక్షుడిగా, రాజ్యసభ సభ్యుడిగా, బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడిగా కీలక బాధ్యతల్లో ఉన్న డా. కే. లక్ష్మణ్ ముందు వరుసలో కనిపిస్తున్నారు. విద్యార్థి దశ నుంచి బీజేపీ అనుబంధ విభాగాల్లో కొనసాగుతూ.. దశాబ్దాలుగా పార్టీకి సేవలందిస్తున్నారు. పార్టీకి అత్యంత విధేయుడిగా, క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా ఆయనకు పేరుంది. అందుకే 2018లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలైనప్పటికీ.. పార్టీ ఆయన సేవలను గుర్తించి ఓబీసీ మోర్చా బాధ్యతల్ని ఆయన భుజాలపై మోపింది. తర్వాత ఉత్తర్ ప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యుణ్ణి చేసింది. ఆ తర్వాత బీజేపీలోనే అత్యున్నత నిర్ణయాత్మక విభాగమైన పార్లమెంటరీలో బోర్డులో సభ్యుడిగా చేసింది. బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీలోనూ సభ్యుడిగా ఆయన కొనసాగుతున్నారు. అప్పగించిన బాధ్యతల్ని పార్టీ ఆదేశాలకు తగ్గట్టు నిర్వహిస్తూ ముందుకెళ్తున్నారు. మాతృభాష తెలుగుతో పాటు హిందీ, ఇంగ్లిష్ భాషల్లోనూ మాట్లాడగలరన్న పేరుంది. ఇవన్నీ పార్టీ జాతీయాధ్యక్ష పదవికి అర్హతలుగా మారాయి. మరోవైపు దక్షిణాది నుంచి ఆయనకు పోటీగా ఉన్న ఇతర సీనియర్ నేతలు దాదాపుగా కేంద్ర మంత్రివర్గంలో చోటు సంపాదించారు. పార్టీ నియమావళి ప్రకారం ప్రభుత్వంలో కీలక పదవుల్లో ఉన్నవారికి పార్టీ బాధ్యతలు అప్పగించరు. లక్ష్మణ్‌కు మోదీ – షా ద్వయంతో పాటు సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ ఆశీస్సులు కూడా ఉన్నాయి. ఇవన్నీ కలిసొస్తే డా. కే. లక్ష్మణ్ బీజేపీ జాతీయాధ్యక్షులుగా ఎంపికయ్యే అవకాశం ఉంది.

ఒకవేళ బీజేపీ అధ్యక్ష బాధ్యతల్ని కూడా మహిళకు అప్పగించి “నారీ శక్తి” నినాదాన్ని మరింత బలంగా చాటిచెప్పాలని భావిస్తే, స్మృతి ఇరానీ రేసులో ముందు వరుసలో కనిపిస్తున్నారు. తాజా లోక్‌సభ ఎన్నికల్లో ఆమె అమేథీ నియోజకవర్గంలో ఓటమి పాలయ్యారు. ఫలితంగా ఆమె కేంద్ర మంత్రివర్గంలో చోటు సంపాదించలేకపోయారు. ఆమె కూడా పార్టీ విధేయురాలు, క్రమశిక్షణ కలిగిన కార్యకర్త. అన్నింటికంటే.. ఆమెకు మోదీ – అమిత్ షాల ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయి. ఇంగ్లిష్, హిందీ భాషల్లో అనర్గళంగా మాట్లాడ్డమే కాదు, ఆకట్టుకునేలా మాట్లాడ్డంలోనూ ఆమె సిద్ధహస్తున్నారు. ఈ అర్హతల నేపథ్యంలో స్మృతి ఇరానీ పేరు జాతీయాధ్యక్ష పదవి రేసులో బలంగా వినిపిస్తోంది. పైగా తమకు తిరుగులేదు అనుకున్న హిందీ రాష్ట్రాల్లోనే బీజేపీకి ఈసారి ఎదురుగాలి వీచింది. ముఖ్యంగా ఉత్తర్ ప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో బీజేపీ సీట్లకు భారీగా గండి పడింది. ఈ రాష్ట్రాలతో పాటు ఉత్తరాదిన ఆత్మపరిశీలన, లోటుపాట్ల గుర్తింపు, దిద్దుబాటు చర్యలు చేపట్టాల్సిన పరిస్థితుల్లో బీజేపీ ఉంది. స్మృతి ఇరానీ గతంలో పార్టీలో అధికార ప్రతినిధిగా వ్యవహరించారు. టీవీ డిబేట్లలో పాల్గొంటూ పార్టీ వాణి బలంగా వినిపించారు. ఇప్పుడు పార్టీ నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తే స్వీకరించేందుకు కూడా సిద్ధంగా ఉన్నారు. అయితే అధిష్టానం ఎవరికి ఖరారు చేస్తుందన్నది మాత్రం ఊహించడం కష్టమే.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

వాతావరణ శాఖ హెచ్చరిక.. ఈ ప్రాంతాల్లో ఈదురుగాలులతో అతిభారీ వర్షాలు
వాతావరణ శాఖ హెచ్చరిక.. ఈ ప్రాంతాల్లో ఈదురుగాలులతో అతిభారీ వర్షాలు
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!